
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈ ఆటగాళ్లంతా మంగళవారం సరదగా ఇన్స్టా లైవ్లో మాట్లాడుకున్నారు. ఇంతలో ధోనీకి కనెక్ట్ చేసిన పంత్.. తమతో మాట్లాడని రిక్వెస్ట్ చేశాడు. దానికి నిరాకరించిన మహీ.. అంత టైమ్ లేదంటూ కాల్ కట్ చేశాడు. దాంతో రోహిత్, సూర్య పగలబడి నవ్వుకున్నారు.
ఈ వీడియోలో ధోనీ సతీమణి సాక్షి సింగ్ కూడా కనిపించింది. ముందుగా పంత్ రిక్వెస్ట్ను స్వీకరించిన ఆమె ముఖం చాటేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఫోన్ మహీకి ఇచ్చింది. ముందుగా అందరికి హాయి చెప్పిన ధోనీ.. పంత్ లైవ్ అని చెప్పగానే కట్ చేశాడు. ఇక విండీస్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడడానికి రోహిత్ శర్మ, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, భువనేశ్వర్, రవిచంద్రన్ అశ్విన్ వెస్టిండీస్కు చేరుకున్నారు. కాగా ధోనీ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం హాలిడే మూడ్లో ఉన్నాడు. వెకేషన్లో భాగంగా ధోని.. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి లండన్లో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఆ తర్వాత యుజ్వేంద్ర చాహల్ లైవ్లోకి రాగా.. అతన్ని పంత్, సూర్యకుమార్ యాదవ్ ఆటపట్టించారు. అయితే చాహల్ను లైవ్ నుంచి తొలగించాలని రోహిత్ పంత్కు సూచించాడు.అతను తనదైన శైలిలో మాట్లాడటం లేదని చెప్పాడు.
ఇక రిషభ్ పంత్, రోహిత్ వన్డే సిరీస్కు దూరంగా ఉండగా.. సూర్య రెండు సిరీస్ల్లో ఆడనున్నాడు. శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత్ ఇప్పటికే వన్డే సిరీస్ 2-0తో కైవసం చేసుకొని క్లీన్ స్వీప్పై కన్నేసింది. నేడు రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మూడో వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. జూలై 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. ఇక ఈ పర్యటనకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఈ టీ20 సిరీస్ను టీమిండియా ప్రాక్టీస్గా వాడుకోవాలనుకుంటుంది.