చెన్నై: బ్యాటింగ్లో 10-15 పరుగులు తక్కువగా చేయడమే తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. పంజాబ్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోనీ.. పవర్ ప్లేలో తమ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందన్నాడు.
'విజయం కోసం అన్ని విధాలుగా ప్రిపేరవ్వాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్లో చివరి ఓవర్లలో 10-15 పరుగులు అదనంగా చేయాల్సింది. అప్పుడు మా బౌలింగ్కు కాస్త ప్రొటెక్షన్ లభించేది. స్లోయర్ బాల్స్ గ్రిప్ అయ్యాయి. మా బ్యాటర్లు నిలకడగా పరుగులు చేస్తున్నారు. ఒకటి రెండు, బ్యాడ్ ఓవర్లు దొరికి ఉంటే పరిస్థితులకు తగ్గట్లు ఆడేవాళ్లం.

మేం సరిగ్గా బౌలింగ్ చేయలేదు. సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేయలేదు. జట్టులో ఉన్న సమస్య ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక తప్పా? లేదా అమలు చేయడంలో విఫలమవుతున్నామా? అనే విషయాన్ని గుర్తించాలి. పతీరణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలోనే కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సింది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే(52 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(37), శివమ్ దూబే(28) మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, సామ్ కరణ్, రాహుల్ చాహర్, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసి గెలుపొందింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(42), లియామ్ లివింగ్ స్టోన్(40) రాణించారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ పతీరణకు ఓ వికెట్ దక్కింది. 19వ ఓవర్లో తుషార్ దేశ్పాండే 13 పరుగులు ఇవ్వడం చెన్నై విజయవకాశాలను దెబ్బతీసింది.