చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్, తెలుగు తేజం షేక్ రషీద్పై ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసల జల్లు కురిపించాడు. షేక్ రషీద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. అతను అందరిలా కాదని, తనదైన షాట్లతో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే ఆటగాడని ప్రశంసించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుసగా 5 పరాజయాల తర్వాత విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్తోనే గుంటూరు కుర్రాడైన షేక్ రషీద్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్లోనే ఈ 20 ఏళ్ల కుర్రాడు అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ధోనీ.. ఈ విజయం తమ జట్టు ప్రయాణాన్ని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించిందని చెప్పిన ధోనీ.. బ్యాటింగ్లో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలని అభిప్రాయపడ్డాడు. అనంతరం అరంగేట్ర ప్లేయర్ షేక్ రషీద్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.

ఈ గెలుపు జోరు కొనసాగాలని..
'ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ మాకు అనుకూలంగా సాగలేదు. ఈ విజయం మా జట్టుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనుంది. ఇదో కఠినమైన మ్యాచ్. విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపు మాకు మూమెంటమ్గా మారుతుందని ఆశిస్తున్నా. గత మ్యాచ్ల్లో మేం తొలి 6 ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం. మిడిల్ ఓవర్లలో పుంజుకునేవాళ్లం. బ్యాటింగ్లో కూడా ఆశించిన ఆరంభాలను అందుకోలేకపోయాం.
చెన్నై వికెట్ కావడంతోనే మేం విఫలమయ్యామనుకుంటా. మేం మెరుగెన వికెట్లపై అత్యుత్తమంగా రాణించాలి. బ్యాటర్లకు ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. పవర్ ప్లేలో బౌలింగ్ చేసేందుకు మాకు ఎక్కువ బౌలర్లు కావాలి. పవర్ ప్లేలోనే రెండు ఓవర్లు బౌలింగ్ చేయించి అశ్విన్పై ఒత్తిడి పెట్టాం. అందుకే పవర్ ప్లేలో ఎక్కువగా బౌలింగ్ చేసే బౌలర్లు ఉండేలా జట్టులో మార్పులు చేశాం. ఈ మ్యాచ్లోని బౌలింగ్ అటాక్ బాగుంది. ఈ మ్యాచ్లో మా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. కానీ బ్యాటింగ్లో ఇంకాస్త మెరుగవ్వాల్సి ఉంది.
రషీద్ సూపరో సూపర్..
షేక్ రషీద్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. గత కొన్నేళ్లుగా అతను మా జట్టులో కొనసాగుతున్నాడు. అతని ఆటలోని మెరుగుదలను మేం గమనించాం. ఈ ఏడాది అతను నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన అవసరం మాకు వచ్చింది. దాంతోనే షేక్ రషీద్కు అవకాశం దక్కింది. అతను అద్భుతంగా ఆడాడు. కానీ ఇది ఆరంభం మాత్రమే. ఇతర బ్యాటర్లలా కాకుండా అద్భుతమైన షాట్లతో ఆధిపత్యం చెలాయించే సామర్థ్యం అతనికి ఉంది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ధోనీ విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(2/24), మతీష పతీరణ(2/45) రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది. ధోనీ(11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 26 నాటౌట్)తో పాటు శివమ్ దూబే(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43 నాటౌట్), రచిన్ రవీంద్ర(22 బంతుల్లో 5 ఫోర్లతో 37), అరంగేట్ర ప్లేయర్ షేక్ రషీద్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27) రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్(2/18) రెండు వికెట్లు తీయగా.. దిగ్వేజ్ రతి, ఆవేశ్ ఖాన్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు. సీఎస్కే ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో ధోనీ దూకుడుగా ఆడి మ్యాచ్ను మలుపు తిప్పాడు.