
దుబాయ్: పేలవ బ్యాటింగ్తోనే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలయ్యామని చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. 150 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన ధోనీ.. తమ బ్యాట్స్మన్ ధాటిగా ఆడలేకపోయారన్నాడు. ఇక పిచ్ రెండు విధాలుగా ఉందని, మరీ నెమ్మదిగా లేకున్నా షాట్లు ఆడటం కష్టమైందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా ఇలానే జరిగిందని, కాకపోతే శిఖర్ ధావన్ ఆరంభంలో ధాటిగా ఆడి ఆ జట్టు పనిని సులువు చేశాడన్నాడు.
'మేం అటు ఇటుగా 150 పరుగులు చేయాలనుకున్నాం. కానీ, ఆరంభంలోనే పలు వికెట్లు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దీంతో ధాటిగా ఆడలేక విఫలమయ్యాం. చివరికి 15-16 ఓవర్ల తర్వాత పిచ్ కొంచెం బ్యాటింగ్కు అనుకూలంగా మారడంతో రాయుడు బాగా ఆడాడు. ఏమైనా జట్టు స్కోర్ 150 పరుగులు చేసుంటే బాగుండేది. పోరాడటానికి వీలుండేది. కాగా, ఈ పిచ్ రెండు విధాలుగా ఉంది. మరీ నెమ్మదిగా లేదు. అలా అని షాట్లూ ఆడలేము. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా కూడా ఇలాగే జరిగింది.
ఇది ఎత్తుగా ఉన్న బౌలర్లకు అనుకూలమైన వికెట్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలుచుకోవడానికి బాగా కష్టపడింది. మేం పవర్ప్లేలో ఎక్కువ పరుగులు ఇవ్వాల్సింది కాదు. శిఖర్ ధావన్ ఆడిన 4వ ఓవర్లో 20 రాబట్టాడు. మేటి బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు ఇవన్నీ సహజమే. ధావన్ ధాటైన ఇన్నింగ్సే చివర్లో ఢిల్లీ పని సులువు చేసింది' అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా... 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అక్షర్ పటేల్ (2/18) చెన్నైని దెబ్బ తీశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39), హెట్మైర్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 28 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్స్ టేబుల్లో టాప్కు దూసుకెళ్లింది.
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (13), డుప్లెసిస్ (10) సహా రాబిన్ ఉతప్ప (19), మొయిన్ అలీ (5) టాపార్డర్ చేతులెత్తేయడంతో చెన్నై బలహీనత బయటపడింది. వీళ్లంతా 62 పరుగులకే పెవిలియన్ చేరిపోయారు. చప్పగా సాగిపోతున్న చెన్నై ఇన్నింగ్స్కు అంబటి రాయుడు పెద్ద దిక్కయ్యాడు. కానీ అవతలి వైపు విశేష అనుభవజ్ఞుడైన కెప్టెన్ ధోనీ(27 బంతుల్లో 18) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. దాంతో ధోనీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ ఆడిన బంతులు జడేజా ఎదుర్కొన్నా స్కోర్ సులువుగా150 ధాటేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ధోనీ కథ ముగిసిందని, రిటైర్మెంట్ తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.