బ్యాటింగ్ వైఫల్యమే మరోసారి తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో సరైన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయామని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు సమష్టిగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ 12 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. ఈ ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.
పోరాడే లక్ష్యం నమోదు చేయలేక..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై మాట్లాడిన ధోనీ.. 15-20 పరుగులు తక్కువగా చేశామని, అదే తమ ఓటమిని శాసించిందని చెప్పాడు. 'మేం వరుసగా వికెట్లు కోల్పోవడం మా ఓటమికి కారణమైంది. తొలి ఇన్నింగ్స్లో పిచ్ మెరుగ్గానే ఉంది. కానీ 157 సమర్థనీయమైన స్కోర్ కాదు. వికెట్పై పెద్దగా టర్న్ కూడా లేదు. కాకపోతే టూ పేస్డ్గా ఉంది. బంతి కాస్త ఆగుతూ వచ్చింది. కానీ అసాధారణమైన వికెట్ అయితే కాదు.

బ్రెవిస్ బ్యాటింగ్ అద్భుతం..
రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు కాస్త సహకారం లభించింది. మాకు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేస్తున్నారు. కానీ మేం 15-20 పరుగులు తక్కువగా చేయడంతో వారు ఏం చేయలేకపోయారు. డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా ఆడాడు. మిడిలార్డర్లో ఇలా ఆడే ఆటగాడు మాకు అవసరం. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సరైన షాట్స్ ఆడాలి. మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవాలనుకున్నాం. ఇలాంటి టోర్నీల్లో లోపాలను అత్యంత త్వరగా సరిదిద్దుకోవాలి. అయితే జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు విఫలమవుతున్నప్పుడు ఎక్కువ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు సాగలేం. ఈ మ్యాచ్లో మేం పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
నిప్పులు చెరిగిన హర్షల్ పటేల్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 42), ఆయుష్ మాత్రే(19 బంతుల్లో 6 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/28) నాలుగు వికెట్లతో సీఎస్కే పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.
అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 44), కామిందు మెండీస్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(2/42) రెండు వికెట్లు తీయగా. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.