టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన ఆరాధ్య క్రికెటర్ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఉన్న గొప్ప ఆటగాళ్లలో గవాస్కర్ ఒకరని ధోనీ గుర్తు చేసుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ నేపథ్యంలో ఈ వీడియోను అధికారిక బ్రాడ్ కాస్టర్స్.. మరోసారి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో ధోనీ.. సునీల్ గవాస్కర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'సునీల్ గవాస్కర్ గొప్ప క్రికెటర్. నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఆ తరం క్రికెటర్లలో బాగా వినిపించే ఆటగాళ్లలో సన్నీ భాయ్ పేరు ఒకటి. మరీ ముఖ్యంగా వెస్టిండీస్ పేస్ బౌలర్లను అతను ఆడిన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది. వెస్టిండీస్లో ఒకరు.. ఇద్దరూ బౌలర్లను కాదు. జట్టులోని భీకరమైన పేసర్లందరిని గవాస్కర్ సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు అందరికి తెలిసిందే. క్రికెట్ను మనం జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తాం. కానీ ఈ ఆటలో కొనసాగాలంటే.. అందుకు తగ్గ బలం, దైర్యం కావాలి.

అందరిలో కొంత భయం ఉంటుంది. భయం లేకుండా ఎవరం ధైర్యంగా ముందడుగు వేయలేం. గవాస్కర్ ప్రదర్శన కూడా ఇలానే ఉండేది. నేను ఆన్ అండ్ ఆఫ్ ఫీల్డ్లో చేసినదానికి గవాస్కర్ సంతోషంగా ఉన్నాడు. నేను కూడా తప్పిదాలు చేశాను. కానీ తరుచుగా కాదు. కాబట్టి ఆయన దృష్టిలో నాకు స్టాంప్ లాంటి అనుమతి లభించింది. ఆయన నన్ను ఆటోగ్రాఫ్ అడగడం నా మనసును హత్తుకుంది. ఆయన ఆటోగ్రాఫ్ అడిగిన క్షణం కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ తర్వాత ఆటోగ్రాఫ్ ఇచ్చాను.'అని ధోనీ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా ధోనీని గవాస్కర్ ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నాడు. తన షర్ట్పై మరి సైన్ చేయించుకున్నాడు.