చెన్నై: బ్యాటింగ్ వైఫల్యంతోనే గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోనీ.. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని, ఆ తప్పిదమే తమ ఓటమిని శాసించిందని ధోనీ చెప్పుకొచ్చాడు.
'మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయాల్సింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో స్పిన్ బౌలర్లు ఎక్కువగా లేకున్నా.. అనుభవం కలిగిన స్పిన్నర్లు ఉన్నారు. దాంతో మా బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయడంలో తడబడ్డారు. ఈ లక్ష్యం చేధించడం పెద్ద కష్టమేమి కాదు. లక్ష్యానికి సమీపంగా రావడం సంతోషంగా ఉంది. ఎందుకంటే టోర్నీ చివరి దశలో రన్రేట్ కీలకం అవుతోంది. అందుకే రన్రేట్ దెబ్బ తినకుండా ఉండాలని దగ్గరగా తీసుకొచ్చాం.

ఫీల్డ్ సెటప్ చూస్తూ.. బౌలర్ ప్రయత్నాలను పసిగడుతూ.. క్రీజులో నిలబడాలి. బౌలర్ తప్పు చేసేలా ఆడాలి. నేను దాని కోసమే ఎదురు చూశాను. నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. మనం మన బలాలను నమ్ముకొని ఆడాలి. నా బలం స్ట్రైట్గా హిట్ చేయడం. డ్యూ కూడా ఉండటంతో బ్యాటర్లకు ఈజీగా మారింది. మా బౌలర్ల ప్రదర్శన పట్ల నేను సంతోషంగా ఉన్నా.
ఇది కెప్టెన్గా నాకు 200 మ్యాచ్ అనే విషయం తెలియదు. మైలురాళ్లను నేను పెద్దగా పట్టించుకోను. వాటికంటే ఎలా ఆడుతున్నామనేదాన్నే పరిగణలోకి తీసుకుంటా'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్(36 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(38), అశ్విన్(30), హెట్మైర్(30 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. డేవాన్ కాన్వే(38 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజింక్యా రహానే(38), ధోనీ(17 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 32 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్, చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలో వికెట్ తీసారు.