
చెన్నై: స్కూల్, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ల తరఫున ఆడటం వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. టీమిండియాలోకి ఓ సెన్సేషన్గా వచ్చిన ధోనీ అనుకోకుండా కెప్టెన్గా మారి... మూడు ఐసీసీ టైటిల్స్తో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే మాహీ ఎప్పుడూ సక్సెస్ క్రెడిట్ ఎవ్వరికీ ఇచ్చింది లేదు. అయితే తాజాగా తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాహీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..
తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ధోనీ... ఈ సందర్భంగా మాట్లాడుతూ రాంచీ క్రికెట్ అసోసియేషన్, తన స్కూల్ తరఫున ఆడటం వల్లే భారత్కు ఆడే అవకాశం దక్కిందన్నాడు. 'నేను ఓ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వేడుకలకు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా నేను, నా జిల్లా క్రికెట్ అసోసియేషన్ రాంఛీకి ధన్యవాదాలు తెలపాలని అనుకుంటున్నా.
క్రికెటర్లు తమ సొంత జిల్లాల తరుపున ఆడడాన్ని గర్వంగా భావించాలి. నేను కూడా రాంచీ క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడినందుకు గర్వపడుతున్నా. ఎందుకంటే నా జిల్లాకు ఆడకపోతే దేశానికి ఆడే వాడిని కాదు కదా?. నా స్కూల్, జిల్లాకు ఆడటం వల్లే దేశానికి ఆడే అవకాశం దక్కింది. అందుకే వాళ్లు లేకపోతే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు.'అంటూ ధోనీ చెప్పుకొచ్చాడు.
2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.., వైజాగ్లో పాకిస్తాన్పై సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా కెప్టెన్గా మారిన ఎంఎస్ ధోనీ, మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను గెలిచాడు. దాంతో మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఏకైక సారథిగా ధోనీ చరిత్రకెక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా 4 టైటిళ్లు అందించాడు.