క్రికెట్కు పూర్తిగా దూరమైన తర్వాత ఇండియన్ ఆర్మీలో చేరుతానని టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. గతంలో టీమిండియాకు ఆడే సమయంలోనే ధోనీ.. భారత ఆర్మీలో చేరి దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించాడు. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత కశ్మీర్ లోయలోని 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లో విధులు నిర్వర్తించాడు.
పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీలు చేయడంతో పాటు భద్రతా దళాలతో ఎక్కువ సమయం గడిపాడు. ఆర్మీలో పనిచేయాలనేది ధోనీ కల. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన వెంటనే అతనికి ఇండియన్ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చింది. సమయం దొరికినప్పుడల్లా ఆర్మీలో సేవ చేసేందుకు ధోనీ ఆసక్తి కనబర్చాడు.

ఇందుకోసం 2015లో ఆగ్రా ట్రైనింగ్ క్యాంప్లో ఇండియన్ ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్ల ద్వారా పారాట్రూపర్గా ట్రైనింగ్ పూర్తి చేశాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని.. ఆటకు పూర్తిగా దూరమైన తర్వాత ఏం చేస్తావని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమిచ్చాడు.
'ఇప్పటి వరకు అయితే భవిష్యత్తు గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఇప్పటికీ నేను క్రికెట్ ఆడుతున్నా. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నా. దాంతో నాకు భవిష్యత్తు గురించి ఆలోచనే రాలేదు. క్రికెట్ తర్వాత ఏం చేస్తాననేది ఆలోచిస్తుంటే నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది.
అయితే నాకు ఆర్మీలో మరింత సమయం గడపాలని ఉంది. గత కొన్నేళ్లుగా నేను ఎక్కువ సమయం వెచ్చించలేదు. ఆ లోటును పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. మళ్లీ ఆర్మీలో చేరి దేశానికి సేవలందిస్తాను.'అని ధోనీ సమాధానమిచ్చాడు. చిన్నప్పుడు తనకు భారత సైనికుడు అవ్వాలనే కోరిక ఉండేదని ధోనీ చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు.
ఆర్మీ సిబ్బందిని చూస్తున్నప్పుడల్లా తాను కూడా పెద్దాయ్యక సైన్యం చేరాలని అనుకునేవాడినని తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్న 42 ఏళ్ల ధోనీకి ఇదే చివరి సీజన్ కానుంది. గతేడాదే వీడ్కోలు పలుకుతాడని భావించినా.. అతను తన రిటైర్మెంట్ ప్రణాళికను ఈ ఏడాదికి వాయిదా వేసాడు. చెన్నై సూపర్ కింగ్స్ను నడిపించే సరైన ఆటగాడి కోసం ధోనీ ఎదురు చూస్తున్నాడు.