తన వల్లే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సీఎస్కే 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివర్లో తడబడి గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకుంది. బ్యాటింగ్ పిచ్పై ఆఖరి 3 బంతుల్లో 6 పరుగులు చేయలేక మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. ఈ ఓటమికి తానే కారణమని చెప్పాడు. చివర్లో తాను కొన్ని షాట్స్ ఆడాల్సిందని, తన వైఫల్యం వల్లే ఒత్తిడి పెరిగిందని విచారం వ్యక్తం చేశాడు.
నేను భారీ షాట్స్ ఆడాల్సింది..
'నేను బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు.. విజయానికి కావాల్సిన పరుగులను చూస్తే.. నేను కొన్ని భారీ షాట్స్ ఆడి ఉంటే బాగుండేది. ఈ ఓటమికి నేనే బాధ్యుడిని. ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం దక్కింది. అయినా మేం మిడిల్ ఓవర్లలో పుంజుకున్నాం. కానీ రొమారియో షెపర్డ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బౌలర్లు ఏ బంతులు వేసినా సిక్సర్లు బాదాడు. డెత్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసేందుకు మేం యార్కర్లు వేయడం ప్రాక్టీస్ చేయాలి. తరుచూ యార్కర్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై పరుగులు కట్టడి చేయాలంటే యార్కర్లే కీలకమవుతాయి. కచ్చితమైన యార్కర్ సాధ్యం కాకపోతే లో-ఫుల్ టాస్ వేయాలి. లో-ఫుల్ టాస్ను భారీ షాట్గా మల్చడం చాలా కష్టం.

స్కూప్ షాట్స్ ఆడాలి..
పతీరణ వంటి బౌలర్ యార్కర్లు సాధ్యం కాకపోతే.. పేస్ను నమ్ముకొని బౌన్సర్లు వేస్తాడు. బ్యాటర్లను ఇబ్బంది పెడుతాడు. కొన్నిసార్లు యార్కర్లు వేసే క్రమంలో లైన్ మిస్సైతే.. బ్యాటర్లు భారీ షాట్స్ ఆడుతారు. కొందరు బ్యాటర్లు స్కూప్ షాట్స్తో పరుగులు రాబడుతారు. అయితే అందరికీ స్కూప్ షాట్స్ ఆడటం సాధ్యం కాదు. సహజంగా ఈ షాట్ ఆడితే ఏ సమస్య లేదు. అలా కాకుండా ప్రయత్నిస్తే మాత్రం ఎంతటి గొప్ప బ్యాటర్కు అయినా ఇబ్బంది అవుతుంది. ఈ తరంలో అందరూ ఈ స్కూప్ షాట్స్ ఆడటం నేర్చుకోవాలి. మా బ్యాటర్లలో చాలా మంది స్కూప్ షాట్స్ ఆడటం లేదు. జడేజా ఒక్కడే సౌకర్యవంతగా ఈ షాట్ ఆడగలడు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని ధోనీ మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓడినప్పటికీ తమ బ్యాటింగ్ ప్రదర్శన ఆకట్టుకునేలా ఉందన్నాడు. అంపైర్ నితిన్ మీనన్ తప్పిదంపై పరోక్షంగా మాట్లాడిన ధోనీ.. క్లిష్టమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం కీలకమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసి ఓటమిపాలైంది.