చెన్నై: రవీంద్ర జడేజా అసాధారణ ప్రదర్శనతోనే విజయాన్నందుకున్నామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో చెన్నై ఫైనల్కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ధోనీ.. జడేజా సూపర్ బౌలింగ్.. మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిందని చెప్పాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని చెప్పాడు.రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన ధోనీ.. ఇంకా 8-9నెలల సమయం ఉందని, అప్పుడే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. ఇప్పుడే ఆ తలనొప్పి ఎందుకని ప్రశ్నించాడు.

'ఐపీఎల్ చాలా పెద్దది. ఇది మాకు మరో ఫైనల్ అని చెప్పలేను. ఒకప్పుడు 8 జట్లు ఉంటే ఇప్పుడు 10 జట్లు ఆడుతున్నాయి. నేను ఏ మాత్రం ఇది మరో ఫైనల్ అని అనలేను. గత రెండు నెలలుగా మేం పడ్డ కష్టానికి దక్కిన ప్రతి ఫలం. జట్టులోని ప్రతీ ఒక్కరు రాణించారు. మిడిలార్డర్ బ్యాటర్లకు పెద్దగా అవకాశాలు రాలేదు. గుజరాత్ అద్భుతమైన జట్టు కావడంతో పాటు చేజింగ్లో మంచి రికార్డు ఉండటంతో టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలనుకున్నాం.
కానీ ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం మాకు మేలు చేసింది. జడేజాకు ఈ కండిషన్స్కు సరిగ్గా సరిపోయాయి. అతని బౌలింగ్ను ఆడటం బ్యాటర్లకు కష్టమైంది. అతని బౌలింగే మ్యాచ్ను మలుపు తిప్పింది. మొయిన్ అలీతో అతను నెలకొల్పిన భాగస్వామ్యం కూడా కీలకంగా మారింది. ఫాస్ట్ బౌలర్లకు తమ బలాలను నమ్ముకొని రాణించే వాతావరణాన్ని కల్పించాం. వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశాం. అద్భుతంగా బౌలింగ్ చేయాలని సూచించాం.
సాధ్యమైనంత వరకు వారిని ప్రోత్సహించాం. పేసర్లను తీర్చిదిద్దడంలో సపోర్ట్ స్టాఫ్, బ్రావో, ఎరిక్ కీలక పాత్ర పోషించారు. పిచ్కు తగ్గట్లు ఫీల్డింగ్ను పెట్టి బౌలింగ్ చేశాం. నేను ఫీల్డర్లను బాధపెట్టే కెప్టెన్ను. 2-3 ఫీట్లు ఫీల్డర్లను మారుస్తూనే ఉంటాను. ఫీల్డర్లకు నేను చెప్పేది ఒక్కటే ప్రతీ ఒక్కరు తనపై ఓ కన్నేసి ఉంచాలని, క్యాచ్లు వదిలినా ఏమనను అని చెప్పేవాడిని. నన్ను మాత్రమే చూడాలని కోరేవాడిని.
వచ్చే సీజన్ ఆడటంపై ఇప్పుడే చెప్పలేను. అప్కమింగ్ సీజన్ వేలానికి ఇంకా 8-9 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచే ఈ హెడెక్ ఎందుకు? ఆడినా ఆడకున్నా.. సీఎస్కేకు నేను ఎప్పుడూ అండగానే ఉంటాను.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 60) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(34 బంతుల్లో 4 ఫోర్లతో 40), రవీంద్ర జడేజా(16 బంతుల్లో 2 ఫోర్లతో 22) పర్వాలేదనిపించారు.
గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోమిత్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. శుభ్మన్ గిల్(38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 42), రషీద్ ఖాన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30) మినహా అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, మతీశ పతీరణ తలో వికెట్ తీసారు.