చెన్నై: డ్యూ రావడం తమ విజయవకాశాలను దెబ్బ తీసిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన చెన్నై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోనీ.. కండిషన్స్కు తగ్గట్లు బ్యాటింగ్ చేయకపోవడం ఓటమికి కారణమైందన్నాడు.
పిచ్ చాలా కఠినంగా ఉందని, 180 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ రావడంతో కేకేఆర్ బ్యాటింగ్కు సులువైందన్నాడు. తమ బౌలర్లు తప్పు ఏం లేదని ధోనీ స్పష్టం చేశాడు.

'సెకండ్ ఇన్నింగ్స్లో తొలి బంతి వేసినప్పుడే 180 పరుగులు చేయాల్సిందని అనుకున్నాం. కానీ ఈ వికెట్పై 180 పరుగులు చేయడం చాలా కష్టం. రెండో ఇన్నింగ్స్లో డ్యూ కీలక ప్రభావం చూపించింది. మా బౌలర్లను నిదించాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్లో కండిషన్స్ తీవ్ర ప్రభావం చూపాయి.
శివమ్ దూబే ప్రదర్శనతో సంతోషంగా ఉన్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే దూబే ఏ మాత్రం సంతృప్తిగా ఫీలవ్వడం లేదు. మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీపక్ చాహర్ బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు. ఫీల్డింగ్కు దగ్గట్లు ఎలా బౌలింగ్ చేయాలో అతనికి బాగా తెలుసు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. శివమ్ దూబే(34 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 48 నాటౌట్), రవీంద్ర జడేజా(20) రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ రెండేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. రింకూ సింగ్(43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 54), నితీశ్ రాణా(44 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా.. మహీశ్ పతీరణ ఓ వికెట్ పడగొట్టాడు.