చెన్నై: తన వయసు పైబడిందని చెప్పడంలో తనకు ఎలాంటి సిగ్గులేదని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. వయసు పెరిగినా కొద్దీ అనుభవం వస్తుందని తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన కెరీర్ చివరి దశలో ఉందన్న ధోనీ.. పూర్తిగా ఆస్వాదించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. కీపింగ్ చేయడం అంత సులువైన పని కాదని, మార్క్రమ్ క్యాచ్ను అందుకున్న తనకు అవార్డు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

'నేనేం చెప్పినా.. చేసినా, నా కెరీర్ చివరి దశలో ఉంది. దాన్ని ఆస్వాదించడం చాలా ముఖ్యం. చెన్నైలో ఆడటం చాలా బాగుంది. ఇక్కడి అభిమానులు ఎంతో ప్రేమను, ఆప్యాయతలను అందిస్తున్నారు. నా మాటలు వినేందుకు ఎప్పుడూ మైదానంలో ఆఖరి వరకు వేచి చూస్తారు. బ్యాటింగ్ చేయడానికి నాకు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఈ విషయంపై నేనేం ఫిర్యాదు చేయడం లేదు.
పతీరణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని యాక్షన్ను పిక్ చేయాలంటే టైమ్ పడుతుంది. అతని బౌలింగ్లో వేరియేషన్తో పాటు మంచి పేస్ ఉంది. విచిత్రమైన యాక్షన్తో పాటు నిలకడగా లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసే మలింగాను మనం ఇప్పటికే చూశాం. ఈ తరహా బౌలర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు కష్టమే. పతిరణ మేం వెలికితీసిన బౌలర్.
ఈ మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేయడానికి సంకోచించాను. కాస్త మేఘావృతమై ఉండటంతో అంతగా డ్యూ ఉండదని భావించాను. స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిడిల్ ఓవర్లలో సరైన లెంగ్త్లో బౌలింగ్ చేసి బ్యాటర్లను కట్టడి చేశారు. డెత్ ఓవర్లలో పేసర్లు కూడా అదరగొట్టారు. ఫీల్డ్ సెటప్ విషయంలో బౌలర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడూ మా బౌలర్లకు ఇదే విషయం చెబుతాను.
ఇప్పటికీ నాకు బెస్ట్ క్యాచ్ అవార్డు ఇవ్వలేదు. నేను రాంగ్ పొజిషన్లో ఉండి ఆ క్యాచ్(మార్క్రమ్) పట్టాను. చేతికి గ్లోవ్స్ వేసుకోవడం వల్ల అందరూ క్యాచ్లు పట్టడం చాలా సులువు అనుకుంటారు. కానీ ఈ క్యాచ్ అద్భుతమైనది. చాలా ఏళ్ల క్రితం ఈ తరహా క్యాచ్ను రాహుల్ ద్రవిడ్ కీపింగ్ చేస్తూ అందుకున్నాడు. వయసు పెరిగితే అనుభవం వస్తుంది. నా వయసు కూడా పైబడింది. ఈ విషయం చెప్పేందుకు నేను ఏ మాత్రం సిగ్గుపడను.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 138 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మూడు వికెట్లతో సత్తా చాటిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.