
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ సుమారు పది నెలలుగా మైదానానికి దూరమయ్యాడు. వన్డే ప్రపంచకప్ అనంతరం ఆటకు విశ్రాంతి తీసుకున్న ఈ జార్ఖండ్ డైనమైట్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్తో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ కరోనా గత్తర పుణ్యమా ఆ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదాపడింది. ఇక జరుగుతోందో లేదోననే గందరగోళ స్థితి కూడా నెలకొంది.
ఆ విషయాన్ని పక్కన బెడితే.. లాక్డౌన్ కారణంగా ఎన్నడూ లేని విధింగా దొరికిన ఈ విశ్రాంతిని స్టార్ క్రికెట్లరు తమ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ఫ్యాన్స్తో చిట్చాట్ చేస్తున్నారు. కానీ మహీ ఒక్కడే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ..తన ఫామ్ హౌస్లో తన సతీమణి సాక్షిసింగ్, కూతురు జీవాతో ఈ క్వారంటైన్ సమయాన్నిఆస్వాదిస్తున్నాడు. అప్పడప్పుడూ వారి క్వారంటైన్ వివరాలను సాక్షిసింగ్ తన ఇన్స్టాలో షేర్ చేస్తున్నా ధోనీ మాత్రం అంతగా కనిపించలేదు.
అయితే తాజాగా నెట్టింట్లో ధోనీ ఓ కొత్త లుక్తో దర్శనమిచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు. తాజాగా తన కూతురు జీవాసింగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఓ వీడియోలో ధోనీ తన ముద్దుల కుమార్తెతో, పెంపుడు కుక్కతో ఆహ్లాదంగా ఆటపాటలతో సమయం గడుపుతూ కనిపించాడు. సుమారు రెండు నిముషాలకు పైన సాగే ఈ వీడియోలో మహీ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. చాలా సింపుల్గా టీషర్ట్, లూజ్ ప్యాంట్లో నెరిసిన గడ్డంతో కనిపించాడు. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. నెరిసిన గడ్డం.. నల్లటి జుట్టు.. సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్లో ఉందన్ని ఓ అభిమాని కామెంట్ చేయగా.. ధోనీ క్వారంటైన్ లుక్ అదిరిందని మరో అభిమాని కామెంట్ చేశాడు.