MS Dhoni: క్రికెట్ కామెంట్రీ ఒక కళ అని, అది తనకు లేదని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. క్రికెట్ గణంకాలు తనకు గుర్తుండవని, అందుకే కామెంట్రీ చేయడం లేదని స్పష్టం చేశాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని క్రికెట్ కామెంటేటర్గా చేయవచ్చు కదా? అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
'గణాంకాలు గుర్తుంచుకోవడం నా వల్ల కాదు. ఆటను వర్ణించడం, ఆటగాళ్లను విమర్శించడం మధ్య ఒక సన్నటి గీత మాత్రమే ఉంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టుకుండా మ్యాచ్ సమయంలో కామెంట్రీ చెప్పడం కళ. మ్యాచ్ సందర్భంగా ఓ టీమ్ ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించేటప్పుడు ఎవరి మనసులు నొచ్చుకోకుండా చెప్పాలి. నా కన్నా చాలా మందికి క్రికెట్ గణంకాలపై మంచి పట్టు ఉంది. మీరు నా కెరీర్ గణంకాలు అడిగినా చెప్పలేను.
అలాగే నాకు మాట్లాడటం కంటే చక్కగా వినడం ఇష్టం. నాకు చనువుగా ఉన్నవారితో మాత్రమే నేను మాట్లాడుతాను. నాకు అవగాహన లేని విషయాలపై మాట్లాడను. ఎందుకంటే మాట్లాడటం కంటే వినడం ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకుంటాం కదా.

ప్రజలతో మమేకమయ్యే నైపుణ్యం నాలో లేదు. నేను ఫోన్లో కంటే.. ఎదురుగా కూర్చొని మాట్లాడటానికి ఇష్టపడుతాను. అందుకే ఫోన్ మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతా. నేను ఇది మెరుగుపరుచుకోవాలనుకుంటున్న విషయం. కానీ నేను ఇందులో మెరుగవ్వనుందుకు చాలా సంతోషంగా ఉంది.'అని ధోనీ చమత్కరించాడు. ఈ కార్యక్రమంలోనే ధోనీ అనేక విషయాలు పంచుకున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా పవర్ఫుల్ కనిపిస్తున్నప్పటికీ డ్యూ(తేమ) ఎంత పవర్ఫుల్ జట్టునైనా ఓడిస్తుందని హెచ్చరించాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వయసు అడ్డంకి కాదని, ఫిట్నెస్, ఫామ్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవచ్చని స్పష్టం చేశాడు. జట్టులో కొనసాగాలంటే ఫిట్నెస్, ఫామ్ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నాడు.
2020 ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ కేవలం ఐపీఎల్లోనే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ అనామక ప్లేయర్గా ఐపీఎల్ 2026 సిద్దమవుతున్నాడు. ధోనీ సారథ్యంలోనే సీఎస్కే ఐదు టైటిళ్లు గెలిచిన సంగతి తెలిసిందే. భారత్కు ధోనీ రెండు ప్రపంచకప్లు అందించాడు.