న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు నచ్చిన పని చేసేందుకు ఏ మాత్రం వెనుకాడడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత అనేక వ్యాపారాలు ప్రారంభించిన ధోనీ.. సతీమణి సాయంతో అన్ని రంగాల్లోకి అడుగుపెట్టాడు. చివరకు సినిమా రంగంతో పాటు వ్యవసాయాన్ని కూడా అతను విడిచి పెట్టలేదు.
కరోనా లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండలేకపోయిన ధోనీ.. తన 40 ఎకరాల ఫామ్ హౌస్లో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. స్వయంగా తానే పొలం దున్నాడు. కడక్ నాథ్ కోళ్ల పెంపకం, డైరీ, స్ట్రాబెర్రీ, కాలిఫ్లవర్, వరి వంటి పంటలను పండించిన ధోనీ వ్యవసాయాన్ని అలానే కొనసాగిస్తున్నాడు.

వరల్డ్ బెస్ట్ కెప్టెన్గా ఎంతో క్రేజ్ ఉన్న ధోనీ.. డబ్బులే కావాలనుకుంటే వ్యవసాయానికి కేటాయించిన సమయాన్ని ఇతర రంగాలపై పెడితే కోట్లు సంపాదించగలడు. కానీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈ పని చేస్తున్నానని ధోనీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
'నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసే వారిని చూస్తూనే పెరిగాను. చిన్నప్పిటి నుంచే నాకు మొక్కలు, చెట్లు అంటే ఎంతో ఇష్టం. చెట్లకు పూలు ఎలా పూస్తాయి? కాయలు ఎలా కాస్తాయి? రాత్రికి రాత్రే పెద్దగా ఎలా అవుతాయి? అనే సందేహాలు కలిగేవి. పూలు, కాయలు పెద్దగయ్యే విధానాన్ని దగ్గరుండి చూడాలనిపించేది.
కరోనా కారణంగా నాకు చాలా సమయం దొరికింది. అప్పటికే మాకు రాంఛీలో 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 4-5 ఎకరాల్లో మాత్రమే వ్యవసాయం చేసేవాళ్లు. కరోనా లాక్డౌన్ సమయంలో దొరికిన సమయాన్ని నేను పూర్తిగా వ్యవసాయానికి వెచ్చించాను. వ్యవసాయంలో ఓనమాలు నేర్చుకొని 40 ఎకరాల్లో పంటలు పండిస్తున్నాం.'అని ధోనీ ఓ పాత వీడియోలో చెప్పుకొచ్చాడు.
మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ధోనీ.. కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఇండియా సిమెంట్స్ సంస్థల్లో భాగస్వామిగా ఉన్న ధోనీకి ఓ సినిమా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది.
తన బ్యానర్లో వచ్చిన తొలి సినిమా లెట్స్ గెట్ మ్యారీడ్' బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఓరియో, డ్రీమ్11, మాస్టర్ కార్డ్, వింజో, టీవీఎస్ వంటి డజనుకు పైగా బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఆస్తుల విలువ రూ.1040 కోట్లుగా ఉంటుందనేది ఓ అంచనా.