
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కీలక మార్పులతో బరిలోకి దిగాయి. ఢిల్లీలో రెండు మార్పులు చోటు చేసుకోగా.. చెన్నై ఒక మార్పుతో ఆడుతోంది. 10 మ్యాచ్ల నిరీక్షణ తర్వాత తెలుగు తేజం కేఎస్ భరత్కు అవకాశం లభించింది. గత రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన మన్దీప్ సింగ్ స్థానంలో భరత్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్ సైతం రీఎంట్రీ ఇచ్చాడు. దాంతో లలిత్ యాదవ్పై ఢిల్లీ యాజమాన్యం వేటు వేసింది.
చెన్నై జట్టులో రవీంద్ర జడేజా స్థానంలో శివం దూబే ఆడుతున్నాడు. ఫిట్నెస్ సమస్యలు ఉండటంతోనే రవీంద్ర జడేజాను ఈ మ్యాచ్కు దూరంగా ఉంచామని చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. టాస్ సందర్భంగా మాట్లాడిన ధోనీ.. తమ కాంబినేషన్ నేపథ్యంలో ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని చెప్పాడు. కానీ టాస్ కలిసిరాలేదన్నాడు. ఈ సీజన్ ఆరంభంలో తమకు కలిసి రాలేదని, మెగా వేలంతో జట్టులో జరిగిన మార్పులతో సరైన కాంబినేషన్ సెట్ అవ్వలేదన్నాడు. జడేజా అన్ఫిట్గా ఉండటంతో శివం దూబేను జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు.
పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉందనే చేజింగ్కు మొగ్గు చూపామని ఢిల్లీ సారథి రిషభ్ పంత్ తెలిపాడు. ఈ సీజన్లో తమకు అప్స్ డౌన్స్ ఎదురయ్యాయని, సానుకూల అంశాలపై మేం ఫోకస్ చేసామని చెప్పాడు. ఇదో రసవత్తర మ్యాచ్ అన్న పంత్.. తన గురువు ధోనీ నుంచే ఎన్నో నేర్చుకున్నానని చెప్పాడు. అతనిపైనే వాటిని ఎలా అమలుపరుస్తానో చూడాలని, జట్టులో రెండు మార్పులు చేశామని తెలిపాడు. మన్దీప్, లలిత్ యాదవ్ స్థానంలో కేఎస్ భరత్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారని చెప్పాడు.
సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, మోయిన్ అలీ, ఎంఎస్ ధోనీ, శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, మహీశ్ తీక్షణ, సిమ్రన్ జీత్ సింగ్, ముఖేష్ చౌదరి
ఢిల్లీ: డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కీపర్), రోవ్మన్ పొవెల్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్