టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరని కొనియాడాడు. కోహ్లీతో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉండేదని ధోనీ చెప్పుకొచ్చాడు. ధోనీ సారథ్యంలోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
కెరీర్ ఆరంభంలో కోహ్లీకి ధోనీ అండగా నిలిచాడు. ధోనీ మద్దతుతో కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్గా ఎదగడంతో పాటు అతని వారసుడిగా సారథ్య బాధ్యతలను కూడా స్వీకరించాడు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ధోనీ.. విరాట్ కోహ్లీతో తనకున్న స్నేహబంధాన్ని వెల్లడించాడు.

'కోహ్లీ నా సహచర ఆటగాడు. ఇద్దరం కలిసి భారత్ చాలా కాలం ఆడాం. ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్. మిడిల్ ఓవర్లలో నేను అతనితో చాలా బ్యాటింగ్ చేశాను. మేం క్రీజులో ఉన్నప్పుడు, కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉండేది. మేం ఎక్కువగా డబుల్స్, ట్రిపుల్స్ తీసేవాళ్లం. క్రీజులో ఎక్కువగా పరుగెత్తేవాళ్లం. కోహ్లీతో బయట కలిసేది చాలా తక్కువ. కానీ కలిసిన ప్రతీసారి చాలా విషయాలు మాట్లాడుకుంటాం.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. గత మూడు సీజన్లుగా తన ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ధోనీ ఊరిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ధోనీ.. తన ట్రేడ్ మార్క్ షాట్స్తో అలరించాడు.
11 ఇన్నింగ్స్ల్లో 53.66 సగటు, 220.54 స్ట్రైక్రేట్తో ఏకంగా 161 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యుత్తమ స్కోర్ 37 నాటౌట్. అలాగే మొత్తంగా 14 ఫోర్లు, 13 సిక్సర్లతో బాదాడు. ధోనీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దాంతో ప్రతీ వేదిక పసుపుమయంగా మారింది.
అయితే ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోనీ ఆడుతాడా?లేదా? అనేది సందేహంగా మారింది. ధోనీ ఆడుతానంటే రిటైన్ చేసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని సీఎస్కే ఫ్రాంచైజీ ప్రకటించింది. మరోవైపు ధోనీ మాత్రం వేలం నిబంధనలు ప్రకటించిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పాడు.
'ఐపీఎల్ 2025కి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని మేం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం బంతి నా ఆధీనంలో లేదు. మెగా వేలానికి సంబంధించిన రూల్స్, నింబంధనలు రాగనే.. ఐపీఎల్ 2025లో కొనసాగే విషయంపై నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా.. అది జట్టుకు మేలు చేసేలానే ఉంటుంది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.