భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani)-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా అతిథులుగా హాజరయ్యారు. మార్చి 1న గుజరాత్లోని జామ్నగర్లో ఈ ముందస్తు వివాహా వేడుకలు ప్రారంభమయ్యాయి.
శనివారం రెండోరోజు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లో భాగంగా దాండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడకలకు హాజరైన సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా సంప్రదాయ దుస్తుల్లో దాండియా ఆడారు. ఈ వేడుకలకు సతీ సమేతంగా వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సైతం దాండియా ఆడుతూ సందడి చేశాడు.

వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి ధోనీ దాండియా ఆడిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ధోనీతో పాటు సాక్షి సింగ్, పలువురు బాలీవుడ్ ప్రముఖులు దాండియా ఆడారు. టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్, అతని సతీమణి ఉపాసన సైతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ధోనీతో కలిసి రామ్చరణ్ ముచ్చటిస్తున్న ఓ వీడియో వైరల్గా మారింది. అనంతరం వారు ధోనీతో కలిసి దాండియా ఆడినట్లు తెలుస్తోంది. దాండియా కార్యక్రమానికి ముందు అనంత్ అంబానీ ప్రసంగానికి ముఖేష్ అంబానీ(Mukesh Ambani) భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడి మాటలకు ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు.
చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో తనకు అండగా నిలిచిన తండ్రి ముఖేష్ అంబానీ, తల్లి నీతా అంబానీకి అనంత్ కృతజ్ఞతలు తెలిపారు.
రెండోరోజు వేడుకలకు భారత స్టార్ క్రికెటర్లతో పాటు బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.