కఢక్నాథ్ కోళ్లపై మహీ మనసు:
ఎంఎస్ ధోనీ కఢక్నాథ్ కోళ్లపై (బ్లాక్ చికెన్ రకం) మనసు పారేసుకున్నాడు. మిగతా కోళ్లతో పోలిస్తే.. అత్యధిక పోషక విలువలున్న మధ్యప్రదేశ్లోని భీలాంచల్ ప్రాంతానికి చెందిన కఢక్నాథ్ కోళ్లను రాంచీలోని తన ఫామ్హౌజ్లో మహీ పెంచుకోబోతున్నాడు. భోపాల్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబువా జిల్లాలోని పౌల్ట్రీ రైతు వినోద్ మేధ నుంచి 2వేల కోడి పిల్లల కోసం మహీ మేనేజర్ ఆర్డర్ చేశాడట. డిసెంబర్ 15 కల్లా కోడి పిల్లలను మహీ ఫామ్హౌజ్కు పంపాలని ఆ రైతు ఒప్పందం కూడా కుదురుచుకున్నాడట.
2వేల పిల్లల కోసం ఆర్డర్
తాజాగా పౌల్ట్రీ రైతు వినోద్ మేధ మాట్లాడుతూ... 'మూడు నెలల క్రితం ఎంఎస్ ధోనీ వ్యవసాయ నిర్వాహకులు కృషి వికాస్ కేంద్ర మరియు కఢక్నాథ్ మొబైల్ ఫోన్ యాప్ ద్వారా నాతో సంప్రదింపులు జరిపారు. కఢక్నాథ్ కోళ్లకు సంబందించిన అన్ని విషయాలు వారితో చర్చించా. ఐదు రోజుల క్రితం ఎంఎస్ ధోనీ ఫామ్హౌస్ మేనేజర్ కాల్ చేశాడు. 2000 కోడిపిల్లల కోసం ఆర్డర్ ఇచ్చాడు. డబ్బులు కూడా నా ఖాతాలో జమ అయ్యాయి. దేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెటర్లలో ఒకరైన ధోనీ ఫామ్హౌస్కు కఢక్నాథ్ కోడి పిల్లలను సరఫరా చేస్తున్నందుకు గర్వపడుతున్నా' అని తెలిపాడు.
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి
అంతర్జాతీయ క్రికెట్కు గత ఆగస్టులో వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ.. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో 'మహర్షి'లా తన పొలం పనులు చేసుకున్న ధోనీ.. తాత్కాలికంగా వాణిజ్య ప్రకటనల ఒప్పందాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే సేంద్రీయ వ్యవసాయానికి మాత్రం బ్రాండ్ అంబాసిడర్గా మారనున్నాడు. అంతేకాదు తన సొంత సేంద్రీయ ఎరువు బ్రాండ్ను ధోనీ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నాడు. ధోనీకి సుమారు 50-70 ఎకరాల పొలం ఉంది. రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో పుచ్చ కాయలు, బొప్పాయి పంటని కూడా పండించాడు.
ఐపీఎల్ 2021లో మహీ ఆడుతాడు
ఇక యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020లో ఎంఎస్ ధోనీ పూర్తిగా నిరాశపరిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటిసారి ప్లేఆఫ్స్కు చేరలేదు. కెప్టెన్ ధోనీ నెమ్మదిగా ఆడి విమర్శలు ఎదుర్కొన్నాడు. సారథ్యంలో కూడా తేలిపోయాడు. దీంతో ఐపీఎల్ 2021కి ఆ జట్టు జయమాన్యం ప్రక్షాళన చేయనుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో జరగనున్న మెగా వేలం కోసం చెన్నై ఆసక్తిగా ఎదురు చూస్తోందనడంలో సందేహం లేదు. ఇక మహీ వచ్చే ఐపీఎల్ ఆడుతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
India vs Australia: సతీమణి కోసం.. కోహ్లీ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు: లాంగర్