రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. ఇతర క్రికెటర్లకు భిన్నంగా సామాజిక మాధ్యమాలకు ఈ జార్ఖండ్ డైనమైట్ దూరంగా ఉంటాడన్న విషయం తెలిసిందే. చాలా వరకు మహీకి సంబంధించిన విషయాలను అతని సతీమణి సాక్షి సింగే అభిమానులతో పంచుకుంటుంది. ధోనీ మాత్రం సందర్భం లేకుండా సోషల్ మీడియాలోకి రాడు. కానీ తాజాగా అతను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న వీడియో అందర్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎన్నడూ లేని విధంగా ధోనీ వీడియోను పంచుకోవడం ఏందని అభిమానులు అవాక్కవుతున్నారు.
పైగా ఆ వీడియోకు ఓ చలోక్తిని క్యాప్షన్గా పేర్కొవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. మహీ తన ఫామ్ హౌజ్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా స్ట్రాబెర్రీలను పండిస్తున్నాడు. ఇక పంటను పరిశీలించే క్రమంలో స్ట్రాబెర్రీలను చూసిన ధోనీ ఆగలేక వాటిని తెంచి తిన్నాడు.
దానికి 'నేను స్ట్రాబెర్రీ పొలంలో తిరిగితే మార్కెట్కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు'అని సెటైరిక్గా క్యాప్షన్ ఇచ్చాడు. అన్ని తానే తినేస్తానేమోనని ఉద్దేశంతో ఈ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇక ఎన్నడు లేని విధంగా మహీ సోషల్ మీడియాలో వీడియో పంచుకోవడంతో నెట్టింట వైరల్ అయింది. తాలా ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
రాంచీ శివార్లలోని శంబో గ్రామంలోని తన 43 ఎకరాల ఫామ్ హౌస్లో ధోనీ 10 ఎకరాల్లో టమోటా, క్యాబేజీ, బొప్పాయి, ఇతర పంటలను పండిస్తున్నాడు. ధోనీ ఫామ్ కూరగాయలకు స్థానికంగా మంచి డిమాండ్ రావడంతో వీటిని గల్ఫ్లో మార్కెట్ చేసేందుకు ఫామ్ ఫ్రెష్ ఏజెన్సీతో జార్ఖండ్ వ్యవసాయ శాఖ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఇక గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహీ.. ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం ఆడాడు. కానీ మునపటి సత్తా చాట లేకపోయాడు.