అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో జడేజా(6 బంతుల్లో ఫోర్, సిక్స్తో 15 నాటౌట్) సూపర్ బ్యాటింగ్తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో జడేజా 6, 4 బాది జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ను గెలిపించిన జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నాడు. సాధారణంగా ధోనీ తన భావోద్వేగాలను ప్రదర్శించడు. మ్యాచ్ ఓడినా గెలిచినా.. ఒకేలా ప్రశాంతంగా కనిపిస్తాడు.

కానీ ఈ ఫైనల్లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేయడాన్ని ధోనీ స్పెషల్గా ఫీలయ్యాడు. ఐపీఎల్ రిటైర్మెంట్పై తుది నిర్ణయాన్ని వెళ్లడించకున్నా.. ఈ విజయాన్ని ధోనీ బాగా ఆస్వాదించాడు. రవీంద్ర జడేజాను ధోనీ ఎత్తుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అత్యంత అరుదైన దృశ్యమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.
శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లకు కోల్పోయి 171 పరుగులు చేసి గెలుపొందింది. డెవాన్ కాన్వే(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47), శివమ్ దూబే(21 బంతుల్లో 2 సిక్స్లతో 32), అంబటి రాయుడు(8 బంతుల్లో సిక్స్, 2 ఫోర్లతో 19), అజింక్యా రహానే(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.