న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పోలీస్ ఆఫీసర్గా మారాడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఓ చేతిలో లాఠీ పట్టుకొని మరో చేతిని గన్పై ఉంచిన ధోనీ ఫొటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫొటోలో సహచర పోలీసులు తుపాకులతో ఉగ్రవాదులపై ఎక్కుపెట్టి ఉండటం విశేషం. ఓ సినిమా సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ ఫొటో ఓ అడ్వర్టైజ్మెంట్లో భాగంగా తీసినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్ కోసం రిలయన్స్ సంస్థ వయాకామ్ సంస్థతో ధోనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఓటీటీ రైట్స్ను దక్కించుకున్న వయాకామ్ సంస్థ జియో సినిమా యాప్ ద్వారా మ్యాచ్లు ప్రసారం చేయనుంది. ధోనీని తమ ప్రచారకర్తగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ధోనీ స్టార్ స్పోర్ట్స్ అడ్వర్టైజ్మెంట్లో కనిపించడు. ప్రతీ సీజన్లో స్టార్ స్పోర్ట్స్కు ధోనీ ప్రచార కర్తగా వ్యవహరించాడు. ఐపీఎల్ను ఉద్దేశించి ధోనీ చేత తీసిన అడ్వర్టైజ్మెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్కు దూరమై మూడేళ్లు అవుతున్నా ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అనేక బ్రాండ్స్కు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అటు వ్యాపార వర్గంలోనూ రాణిస్తున్నాడు. ఈ మధ్యే సినిమా నిర్మాణ సంస్థను స్థాపించిన ధోనీ..తమిళంలో ఓ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. లవ్ టుడే హీరోతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ.. అప్కమింగ్ సీజన్తో వీడ్కోలు పలికే అవకాశాలున్నాయి.
మార్చిలో జరగనున్న ఐపీఎల్ 2023 సీజన్ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తున్నాడు. జార్ఖండ్కు చెందిన యువ బౌలర్లతో బౌలింగ్ చేయించుకొని భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ధోనీ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్న ధోనీ.. గతేడాది జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వగా అతను తడబడ్డాడు. దాంతో మళ్లీ కెప్టెన్సీ అందుకున్న ధోనీ సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాడు. చెన్నై వేదికగా సొంత అభిమానుల మధ్య ఆటకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ధోనీ సిద్దమవుతున్నాడు.