
సీఎస్కేకు ఆత్మ లాంటివాడు
'ఎంఎస్ ధోనీ చెన్నై జట్టుకు అతిపెద్ద బలం. మొత్తం ఫ్రాంచైజీ అతడిపై ఆధారపడి ఉంది. మహీ సీఎస్కేకు ఆత్మ లాంటివాడు. అతడు ఉన్నంతకాలం సీఎస్కే బతికే ఉంటుంది. ధోనీ గొప్ప కెప్టెన్, మంచి బ్యాట్స్మెన్. చాలా కాలం తరువాత క్రికెట్ ఆడబోతున్నాడు. మైదానంలో పరుగులు తీయగలడా, గతంలో లాగా బ్యాటింగ్ చేయగలడా అనే ప్రశ్నలు అందరిలో ఉండడం సహజం. కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి. అతడు చాలా అనుభవజ్ఞుడు. మెరుగ్గా రాణిస్తాడని నేను అనుకుంటున్నా' అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎంఎస్ ధోనీ 2019 ప్రపంచ కప్ తరువాత మళ్లీ క్రికెట్ ఆడలేదు. 39 ఏళ్ల ధోనీ ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

మేటి స్పిన్నర్లు ఉన్నారు:
సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నై జట్టులో లేకపోవడం ఇబ్బందికరమే అయినా.. వారికి మిచెల్ సాంట్నర్, ఇమ్రాన్ తాహిర్, కర్న్ శర్మ, రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా వంటి మేటి స్పిన్నర్లు ఉన్నారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇంత మంది స్పిన్నర్లు ఉండడంతో ఒకేసారి ఇద్దరు లేదా ముగుర్ని ఆడించే అవకాశం ఉంటుందన్నాడు. యూఏఈ లాంటి పిచ్లపై ఈ బౌలింగ్ విభాగం చాలా పనికొస్తుందని సూచించాడు.

చెన్నైకి అదే ఇబ్బందికరం
బ్యాటింగ్ విభాగంలో సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా లాంటి ఆటగాడుంటే మరింత కలిసివచ్చేదని వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. దేశీయ బ్యాట్స్మెన్లో మురళీ విజయ్, ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు, కేదార్ జాధవ్ లాంటి వారు ఉన్నారన్నాడు. ఇక పేస్ విభాగంలో దీపక్ చాహర్, సామ్ కరన్, శార్ధుల్ ఠాకుర్, జోష్ హాజిల్వుడ్, లుంగీ ఎంగిడి, డ్వేన్ బ్రావో ఉన్నారని.. వారంతా సమర్థవంతమైన బౌలర్లని ఆయన చెప్పారు. ధోనీ, విజయ్, జాధవ్ లాంటి ఆటగాళ్లు చాలా రోజుల నుంచి ఆటకు దూరంగా ఉండటమే చెన్నైకి ఇబ్బందికర విషయమన్నాడు. ముంబై ఇండియన్స్ ఒక్కటే చెన్నైకి ప్రధాన పోటీదారని, గట్టి పోటీనిస్తుందని పేర్కొన్నాడు.

సర్వత్రా ఆసక్తి
సెప్టెంబర్ 19న అబుదాబిలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో జరిగే ఐపీఎల్ 2020 ప్రారంభ మ్యాచ్లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది. ఏడాది విరామం తరువాత ధోనీ గ్రౌండ్లో ఎలా ఆడతాడా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంఎస్ ధోనీ 2019 ప్రపంచ కప్ తరువాత మళ్లీ క్రికెట్ ఆడని విషయం తెలిసిందే.
CPL 2020ని మనం శాసించాం.. ఇక పార్టీ చేసుకుందాం: షారుక్ ఖాన్


Click it and Unblock the Notifications
