ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమవ్వగా.. మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టాడు. అయితే ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ అద్భుత బ్యాటింగ్తో చెన్నైని గెలిపించాడు.
అయితే ఈ మ్యాచ్ సమయంలో ధోనీ కుంటుతూ కనిపించాడు. కీపింగ్ సమయంలోనూ కాస్త అసౌకర్యంగా కనిపించాడు. లక్నో బ్యాటర్ అబ్దుల్ సమద్ను రనౌట్ చేసిన తర్వాత ధోనీ బ్యాలెన్స్ కోల్పోయాడు. బ్యాటింగ్ వచ్చే ముందు కూడా కుంటుతూ మెట్ల ఎక్కడం టీవీల్లో కనిపించింది. ధోనీకి మోకాలి నొప్పి ఉన్నట్లుందని కామెంటేటర్లు కూడా అన్నారు. సింగిల్స్ తీయకుండా భారీ షాట్స్ ఆడిన ధోనీ.. జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. మ్యాచ్ అనంతరం టీమ్ హోటల్కు వచ్చే సమయంలోనూ ధోనీ కుంటుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

గత కొన్నేళ్లుగా ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ తన ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స చేసుకున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ఈ సర్జరీ జరిగింది. తాజాగా ధోనీ కుంటుతూ కనిపించడంతో ఈ గాయం మళ్లీ తిరగబెట్టిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ధోనీ గాయంపై సీఎస్కే మేనేజ్మెంట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఒకవేళ ధోనీ గాయంతో దూరమైతే మాత్రం సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరంగా తయారవ్వనుంది. ఇప్పటికే మోచేతి గాయంతో దూరమైన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ముంబై క్రికెటర్ ఆయుష్ మాత్రేను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ముంబై తరఫున 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 7 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడిన ఆయుష్ మాత్రే.. 962 పరుగులు చేశాడు. అతన్ని సీఎస్కే రూ. 30 లక్షల కనీస ధరకు తీసుకుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఆ జట్టు బ్యాటింగ్ బలహీనంగా ఉంది.