
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బాగా ఆస్వాదిస్తున్నాడు. మైదానంలో చాలా సరదాగా ఉంటూ సహచర ఆటగాళ్లపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ సందర్భంగా ధోనీ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. డ్వేన్ బ్రావోను ఉద్దేశించిన ధోనీ చేసిన ఆ కామెంట్స్ ఫన్నీగా ఉన్నాయి.
ధోనీ, డ్వేన్ బ్రావో.. మైదానంలోనే కాకుండా బయట కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రౌండ్లో బ్రావోని సరదాగా టీజ్ చేయడంలో ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్లో గత కొన్నేళ్లుగా బ్రావో రెగ్యులర్ ప్లేయర్కాగా.. ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్లో తలపడే సమయాల్లోనూ ఇంతే సరదాగా ఉండేవారు. ఓ మ్యాచ్లో అయితే ధోనీ మెడ చుట్టూ చేతులు వేసిన బ్రావో.. ధోనీని సరదాగా కిందపడేసేందుకు ప్రయత్నించాడు.
ఢిల్లీతో ఆదివారం రాత్రి మ్యాచ్లో ఆఖరి ఓవర్లో బ్యాటింగ్కి వచ్చిన డ్వేన్ బ్రావో.. చివరి రెండు బంతుల్లో డబుల్స్ కోసం పిలవకుండా బౌండరీలు కొట్టమని ధోనీని రిక్వెస్ట్ చేశాడు. కానీ.. ధోనీ మాత్రం బ్రావోని చివరి రెండు బంతుల్లో డబుల్ కోసం పరుగెత్తించాడు. ఆఖరి బంతికి రనౌట్ నుంచి తప్పించుకునేందుకు డైవ్ చేసిన బ్రావో.. ధోనీ వైపు చిరుకోపంతో చూడగా.. అతను మాత్రం నవ్వేస్తూ కనిపించాడు. ఆ తర్వాత చెన్నై ఫీల్డింగ్ టైమ్లోనూ బ్రావోపై ధోనీ సెటైర్లు వేశాడు.
మ్యాచ్ చివర్లో ముకేష్ చౌదరి బౌలింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఆన్రిచ్ నోర్జ్ బంతిని కవర్స్ దిశగా హిట్ చేయగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డ్వేన్ బ్రావో డైవ్ చేసి బంతిని అడ్డుకున్నాడు. దాంతో.. వికెట్ల వెనుక నుంచి ధోనీ.. ''వెల్ డన్ ఓల్డ్ మ్యాన్' అని అనడం స్టంఫ్ మైక్లో రికార్డైంది. బ్రావో వయసు ప్రస్తుతం 39ఏళ్లుకాగా.. ధోనీ వయసు 40 కావడం గమనార్హం.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) ధోనీ (8 బంతుల్లో 2 సిక్స్లు, ఫోర్తో 21 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 41), శివమ్ దూబే(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. మిచెల్ మార్ష్(25), రిషభ్ పంత్(21), శార్దూల్ ఠాకూర్(24), డేవిడ్ వార్నర్(19) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ మూడు వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు తీసారు. మహీశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.