
కాబుల్: గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేసిన విషయం తెలిసిందే. బంతి వేయకముందే బట్లర్ క్రీజు దాటడంతో.. అశ్విన్ బెయిల్స్ పడగొట్టాడు. సుదీర్ఘ సమయం చర్చించిన అంపైర్లు ఔట్ అని ప్రకటించారు. దీనిపై మైదానంలోనే బట్లర్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక టోర్నీ మొత్తం అదే చర్చ నడిచింది. చాలామంది క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా పేర్కొన్నారు. మరికొందరు మాత్రం సమర్థించారు.
తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దేశీయ టీ20 టోర్నీ (షపగీజా)లో కూడా మన్కడింగ్ ద్వారా ఓ బ్యాట్స్మన్ ఔట్ అయ్యాడు. కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కాబూల్ ఈగల్స్, మిస్ ఐనాక్ నైట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన నైట్స్.. ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. షాహిదుల్లా కమల్ హాఫ్ సెంచరీ (58) చేయగా.. నజీబ్ తారకాయ్ 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. జియా-ఉర్-రెహ్మాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
164 లక్ష్య చేధనకు దిగిన కాబూల్ ఈగల్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. నాలుగవ ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన నూర్ అలీ జద్రాన్ జట్టును ఆదుకున్నాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. దీంతో ఈగల్స్ జట్టు లక్ష్యం దిశగా సాగింది. 16వ ఓవర్ వరకు క్రీజులో ఉన్న నూర్ అలీ.. మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ వికెట్ కోసం మిస్ ఐనాక్ నైట్స్ జట్టు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇక్కడే బౌలర్ దావ్లత్ జద్రాన్ మాయ చేశాడు.
16వ నాలుగో బంతిని దావ్లత్ జద్రాన్ వేస్తుండగా.. నూర్ అలీ జద్రాన్ నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్నాడు. బంతి వేయకముందే నూర్ అలీ క్రీజు దాటాడు. ఇది గమనించిన దావ్లత్ జద్రాన్ వెంటనే బెయిల్స్ పడగొట్టాడు. దీంతో మన్కడింగ్ ద్వారా నూర్ అలీ పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత మన్కడింగ్ చేసింది దావ్లత్ జద్రానే. అయితే దావ్లత్ మన్కడింగ్ చేయడం ద్వారా ఆ జట్టుకు ఒరిగిందేమీ లేదు. నూర్ అలీ పెవిలియన్ చేరినా.. కాబూల్ ఈగల్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.