టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ సారథుల్లో ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. భారత్కు అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007తో 2011 వన్డే ప్రపంచకప్ అందించాడు. మరో రెండేళ్లకు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచి ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన సారథిగా చరిత్రకెక్కాడు.
ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఐదు టైటిళ్లు అందించాడు. కెప్టెన్సీ అంటేనే ధోనీ అన్నట్లుగా అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. అలాంటి ధోనీ శకం సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు మొదలైంది. 2007 టీ20 ప్రపంచకప్కు అప్పటి సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉండటంతో కుర్రాళ్లతో కూడిన జట్టుకు ధోనీ కెప్టెన్గా ఎంపికయ్యాడు.

2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ టై కాగా.. బౌల్ ఔట్ పద్దతిలో ఫలితాన్ని తేల్చారు. అప్పటికి ఇంకా సూపర్ ఓవర్ నిబంధన రాలేదు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప(39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ధోనీ(31 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ ఆసిఫ్(4/18) నాలుగు వికెట్లు తీయగా.. షాహిద్ అఫ్రిది(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. యాసిర్ అరఫత్, సోహైల్ తన్వీర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులే చేయడంతో స్కోర్లు టైయ్యాయి. మిస్బా ఉల్ హక్(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 53) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ రెండు వికెట్లు తీయగా.. ఆర్పీ సింగ్, అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్ తలో వికెట్ తీసారు.
బౌల్ ఔట్ పద్దతిలో టీమిండియా విజయం సాధించింది. తెలివిగా భారత స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన ధోనీ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. ఈ మ్యాచ్ నుంచే తన సారథ్య ప్రతిభను చాటుకున్న ధోనీ.. భారత్కు ఎన్నో చిరస్మరనీయ విజయాలు సాధించాడు. బౌల్ ఔట్ పద్దతిలో విజయం సాధించి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ధోనీ అభిమానులు ఈ మ్యాచ్ను గుర్తు చేసుకుంటున్నారు.
India Defeated Pakistan in Bowl-out in the T20I World Cup "OTD in 2007" 👊
— Johns. (@CricCrazyJohns) September 14, 2024
- The start of "Dhoni Era" in Indian cricket. pic.twitter.com/Xe8NQzHI3g