టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ పండుగను సెలెబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఎన్నడూ లేని విధంగా ధోనీ క్రిస్మస్ తాతగా వేషం వేసాడు. శాంటా క్లాజ్ తాత వేషంలో కూతురు జీవాతో పాటు సతీమణి సాక్షి సింగ్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ను ధోనీ అలరించాడు. వారితో కలిసి ఫొటోలు దిగాడు.
దుబాయ్లో ఓ ఫంక్షన్లో ధోనీ దంపతులు క్రిస్మస్ సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. శాంటా క్లాజ్ కాస్ట్యూమ్స్లో ఉన్న ధోనీ ఫొటోలను సాక్షి సింగ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో ధోనీతో పాటు సాక్షి సింగ్, అతని కూతురు జీవా ఉంది. క్రిస్మస్ తాత వేషం వేసిన ధోనీకి జీవా ముద్దు పెట్టింది.

కృతి సనన్ ప్రియుడు కబిర్ బహియా ఇంట్లో ఈ క్రిస్మస్ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కబిర్ షేర్ చేసిన ఫొటోల్లో ధోనీ, సాక్షి, జివాతో పాటు కృతి సనన్, కబిర్, అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. యూకే వ్యాపారవేత్త అయిన కబిర్ బహియాతో కృతి సనన్ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కబీర్ చుట్టాల పెళ్లికి ధోనీ ఫ్యామిలీతో పాటు కృతి సనన్ కూడా హాజరైంది.
క్రిస్మస్ తాతగా ధోనీ బాగున్నాడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కృతి సనన్ టాలీవుడ్తోనే సినీ రంగానికి పరిచయమైంది. సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన 1 - నేనొక్కడినే చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో బీజీ అయిపోయింది.
అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ధోనీ.. కేవలం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గత నాలుగు సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తనదైన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు. తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ధోనీ 90 టెస్ట్లు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 6 శతకాలు, 33 హాఫ్ సెంచరీలతో 4876 పరుగులు చేసిన ధోనీ.. వన్డేల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలతో 10773 పరుగులు సాధించాడు. టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలతో 1617 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గా మూడు ఫార్మాట్లలో కలిపి 634 క్యాచ్లు అందుకోవడంతో పాటు 195 స్టంపౌట్స్ చేశాడు.