అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్తో సోమవారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో ఆఖరి బంతికి బౌండరీ బాది డక్వర్త్ లూయిస్ ప్రకారం 5 వికెట్ల తేడాతో విజయాన్నందుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో డక్ వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని నిర్ణయించగా.. రవీంద్ర జడేజా అసాధారణ బ్యాటింగ్తో చెన్నై చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
16 ఏళ్ల లీగ్ చరిత్రలో ఐదో టైటిల్ను సొంతం చేసుకున్న చెన్నై.. ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. గెలుపుకు పొంగిపోకుండా.. ఓటమికి బాధపడకుండా చాలా ప్రశాంతంగా కనిపించే చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తొలిసారి భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. మ్యాచ్ను గెలిపించిన రవీంద్ర జడేజాను ఎత్తుకొని మనసారా ఏడ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

అభిమానులు తనపై చూపిన ప్రేమతోనే భావోద్వేగానికి గురయ్యానని మ్యాచ్ అనంతరం ధోనీ చెప్పుకొచ్చాడు. 'నా కెరీర్కు చివరి దశ కావడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యా. ఇక్కడే తొలి మ్యాచ్ కోసం బరిలోకి దిగినప్పుడు అభిమానులు నా పేరును పలుకుతుంటే ఎమోషనల్గా మారా. డగౌట్లో ఉన్న నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
అప్పుడే అనుకున్నా ఈ సీజన్ను ఆస్వాదిస్తూ ఆడాలని. అలాగే చెన్నై జట్టు పరిస్థితి కూడా ఇదే. తిరిగి వచ్చి మళ్లీ ఆడేందుకు చేయగలిగినదంతా చేస్తా. నన్ను, నా గేమ్ను చూసేందుకు వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటా. ఇదే సమయంలో నా వ్యక్తిత్వం ఎప్పటికీ మార్చుకోను. ప్రతి ట్రోఫీ ప్రత్యేకమే. అయితే, ప్రతి మ్యాచ్లోనూ ఉత్కంఠ ఉండటమే ఐపీఎల్ స్పెషల్. దాని కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.
శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లకు కోల్పోయి 171 పరుగులు చేసి గెలుపొందింది. డెవాన్ కాన్వే(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47), శివమ్ దూబే(21 బంతుల్లో 2 సిక్స్లతో 32), అంబటి రాయుడు(8 బంతుల్లో సిక్స్, 2 ఫోర్లతో 19), అజింక్యా రహానే(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.