టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కోచ్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ధోనీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త చర్చకు తెరలేపాయి. తాను ఆడినా ఆడకున్నా.. ఎప్పుడూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే ఉంటానని ధోనీ అన్నాడు. దాంతో ధోనీ కోచ్గా రాబోతున్నాడని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్ ఆడే విషయంపై ధోనీ మరోసారి క్లారిటీ ఇవ్వలేదు. అందుకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు. 'నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఐపీఎల్ 2025 సీజన్ ఆడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అందుకు చాలా సమయం ఉంది. కానీ మీరు పదే పదే ఎల్లో జెర్సీలో ఎప్పుడూ కనిపిస్తారని అడిగితే.. నేను ఎప్పుడూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే ఉంటాను.

నేను జట్టు తరఫున ఆడుతానా? లేదా? అనేది వేరే విషయం. నేను, సీఎస్కే ఒక్కటే. రాబోయే 15-20 ఏళ్లు కూడా జట్టుతో నా అనుబంధం కొనసాగుతోంది. నా కంటి చూపు పరంగా నేను ఇంకా ఐదేళ్ల క్రికెట్ ఆడగలనని వైద్యులు చెప్పారు. కానీ శరీరానికి క్లియరెన్స్ రాలేదు. నేను కేవలం కళ్లతో మాత్రమే క్రికెట్ ఆడలేను కదా?'అని నవ్వుతూ ధోనీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆటగాడిగా కొనసాగలేకపోతే మెంటార్గా ధోనీ చెన్నై జట్టులో కొనసాగే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అనామక ఆటగాడిగా బరిలోకి దిగిన ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో చాలా మార్పులు చేశారు. ఎన్నడూ లేని విధంగా సీఎస్కే ఆఖరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్లకు 4 మాత్రమే గెలిచింది. ఐపీఎల్ 2026లో ధోనీ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోనీకి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు. గతంలో మొకాలి నొప్పితో బాధపడినా..సర్జరీతో నయం చేసుకున్నాడు. కాకపోతే అతని వయసే సహకరించాల్సి ఉంది.