ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన కొద్ది రోజులకే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 సీజన్కు తెరలేవనుంది. ఇప్పటికే షెడ్యూల్ ఖారారు చేయడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు చేస్తోంది. మార్చి మూడో వారంలో ఈ ధనాధన్ లీగ్కు తెరలేవనుంది. అయితే ఈ సీజన్లో టీమిండియా దిగ్గజ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
44 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ.. ఐపీఎల్ 2026 సీజన్ ఆడుతాడా? లేక తప్పుకుంటాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలి పోయింది. గత 6 ఏళ్లుగా తన రిటైర్మెంట్పై ధోనీ ఊరిస్తున్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అప్పటి నుంచి ప్రతీ సీజన్కు ముందు అతను ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా సీజన్కు ముందు కూడా ధోనీ రిటైర్మెంట్ వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) అభిమానులకు ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ధోనీ ఆడుతాడని స్పష్టం చేశాడు. ధోనీ రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేసాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ధోనీ సీఎస్కే జట్టులోనే కొనసాగుతున్నాడు. అతని సారథ్యంలో సీఎస్కే ఐదు టైటిళ్లు గెలిచింది. ముంబై ఇండియన్స్ తర్వాత ఐదు టైటిళ్లు గెలిచిన జట్టు సీఎస్కేనే కావడం గమనార్హం. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్కే సీఈఓ కాశీ విశ్వానథన్ను ధోనీ రిటైర్మెంట్ వార్తల గురించి ప్రశ్నించగా.. అతను ఆడుతాడని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్కు ముందే ధోనీ సారథ్య బాధ్యతలను వదులుకొని రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. అయితే గత సీజన్లో అతను గాయంతో దూరమవడంతో తిరిగి జట్టును నడిపించాడు. కానీ ఈ సీజన్లో సీఎస్కే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. వరుసగా రెండో సీజన్లోనూ ప్లే ఆఫ్స్ చేరలేకపోయారు.
అప్కమింగ్ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా ప్రక్షాళన చేపట్టిన సీఎస్కే మేనేజ్మెంట్.. రవీంద్ర జడేజా, సామ్ కరన్లను రాజస్థాన్ రాయల్స్కు ఇచ్చేసి.. సంజూ శాంసన్ను జట్టులోకి తెచ్చుకుంది. ధోనీకి బ్యాకప్గానే సంజూను తీసుకొచ్చినట్లు అర్థమవుతుంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో సీఎస్కే 9 మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఎన్నడూ లేని విధంగా అనామక ఆటగాళ్లు అయిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను రూ.14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ప్రస్తుతం సీఎస్కే జట్టులో ధోనీతో పాటు శాంసన్, ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ వంటి నలుగురు వికెట్ కీపర్లు ఉన్నారు. 'ఏదో ఒక సమయంలో ధోనీ జట్టుకు దూరమవుతాడు. సంజూ శాంసన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. ధోనీ స్థానాన్ని అతను మాత్రమే భర్తీ చేయగలడని మేం భావించాం.'అని సీఎస్కే హెడ్ కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు.