హైదరాబాద్: అతను రాగానే ఆటకు ఊపొచ్చింది..! మసకబారుతున్న భారత క్రికెట్కు వెలుగొచ్చింది..! చేజారుతున్న మ్యాచ్లు గెలవొచ్చనే ధీమా వచ్చింది..! మూడు దశాబ్దాలుగా ఊరిస్తొన్న వరల్డ్కప్ చేతుల్లోకొచ్చింది.! టీమిండియా అంటే స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ పంజా విసరగలదని ప్రత్యర్థులకు తెలిసొచ్చింది.!
అతని 'మహి'మలు ఒకటా రెండా.. అనుకున్నదే తడువుగా సిక్సర్లు కొట్టేసినా.. రెప్పపాటులో స్టంపింగ్స్ చేసినా.. వికెట్లను చూడకుండానే రనౌట్లు చేసినా.. ఇప్పటికీ ఎందరికో అంతుచిక్కని డీఆర్ఎస్ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేట్టుగా మార్చేసినా.. సరికొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టించినా అతనికే చెల్లింది.

అంతేనా.. కుర్రాళ్ల ఆటగా ముద్రపడ్డ ఐపీఎల్లో 'డ్యాడ్స్ ఆర్మీ'తో మూడుసార్లు టైటిల్ కొట్టి లీగ్లో చెన్నైని మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్గా మార్చేసినా.. ఎంతో మంది కుర్రాళ్లను చాంపియన్లుగా తీర్చిదిద్దినా.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ భారత్కు టీ20, వన్డే, వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీ అందించినా.. అతనికే సాధ్యమైంది.
ఈ మహిమల ఇంద్రజాలికుడు.. ఇండియా క్రికెట్ దార్శనికుడు.. మహేంద్ర సింగ్ ధోనీ రేపటితో(జూలై 7) 42వ ఏట అడుగెడుతున్న సందర్భంగా ఈ భారత డైనమైట్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తెలుగు ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద 52 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ధోనీ బర్త్డే సందర్భంగా శుక్రవారం ఈ భారీ కటౌట్ను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేయనున్నారు. ధోనీ గ్రౌండ్లోకి వస్తున్న ఫోజ్తో ఈ కటౌట్ ఏర్పాటు చేశారు.
ఈ కటౌట్పై తెలుగు ఎంఎస్డియన్స్ అనే స్టిక్కర్ వేసారు. ప్రస్తుతం ఈ కటౌట్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ భారీ కటౌట్ నగర ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని నందిగామలో 77 అడుగుల భారీ కటౌట్ను ధోనీ ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అతిపెద్ద కటౌట్గా చరిత్రలో నిలవనుంది.
ధోనీ కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి కాదు.. తొలుత 2018లో కేరళలో 35 అడుగులు కౌటౌట్ను, చెన్నైలో 30 అడుగుల కటౌట్, ఆంధ్రలోని విజయవాడలో 41 అడుగుల కటౌట్ను ఏర్పాటు చేయగా..తాజాగా హైదరాబాద్లో 52 అడుగులు, ఆంధ్రలోని నందిగామలో 77 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ధోనీ బర్త్డే సందర్భంగా అతని బయోపిక్ ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు.