హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే 200 వికెట్లలో పాలుపంచుకున్న తొలి వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ధోనీ ఓ స్టన్నింగ్ క్యాచ్తో పాటు రనౌట్, స్టంపింగ్ చేసి ఈ ఫీట్ సాధించాడు.
తీక్షణ బౌలింగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్న ధోనీ.. జడేజా బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ను స్టంపౌట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ను రనౌట్ చేశాడు. సూపర్ కీపింగ్తో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ఓవరాల్ టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న వికెట్ కీపర్గా ధోనీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో క్వింటన్ డికాక్ రికార్డును ధోనీ అధిగమించాడు. 208 క్యాచ్లతో ధోనీ ఈ జాబితాలో టాప్లో కొనసాగుతుండగా.. 207 క్యాచ్లతో క్వింటన్ డికాక్, 205 క్యాచ్లతో దినేశ్ కార్తీక్, కమ్రాన్ అక్మల్(172), దినేశ్ రామ్దిన్(150) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
మార్క్రమ్ క్యాచ్కు తనకు అవార్డు ఇవ్వాల్సిందని మ్యాచ్ అనంతరం ధోనీ అభిప్రాయపడ్డాడు. చేతికి గ్లోవ్స్ ఉండటంతో క్యాచ్లు పట్టడం సులువని అంతా అనుకుంటారని తెలిపాడు.
'ఇప్పటికీ నాకు బెస్ట్ క్యాచ్ అవార్డు ఇవ్వలేదు. నేను రాంగ్ పొజిషన్లో ఉండి ఆ క్యాచ్(మార్క్రమ్) పట్టాను. చేతికి గ్లోవ్స్ వేసుకోవడం వల్ల అందరూ క్యాచ్లు పట్టడం చాలా సులువు అనుకుంటారు. కానీ ఈ క్యాచ్ అద్భుతమైనది. చాలా ఏళ్ల క్రితం ఈ తరహా క్యాచ్ను రాహుల్ ద్రవిడ్ కీపింగ్ చేస్తూ అందుకున్నాడు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34) టాప్ స్కోరర్గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(3/22) మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ సింగ్, మహీశ్ తీక్షణ, మహీష పతీరణలు తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 138 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. డేవాన్ కాన్వే(57 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(30 బంతుల్లో 2 ఫోర్లతో 35) సత్తా చాటారు. సన్రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే ఒక్కడే 2 వికెట్లు తీసాడు. మూడు వికెట్లతో సన్రైజర్స్ పతనాన్ని శాసించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.