న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తన సారథ్యంలో భారత్కు టీ20 ప్రపంచకప్తో పాటు వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఐసీసీ టైటిళ్లు అన్నీ గెలిచిన ఏకైక సారథిగా ధోనీ చరిత్రకెక్కాడు.
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ ఆడిన ఇన్నింగ్స్ను ఎవరూ మరిచిపోరు. ముఖ్యంగా అతను కొట్టిన విన్నింగ్ షాట్ ఇప్పటికే కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. 'ధోనీ.. ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఏ మాగ్నిఫిషియెంట్ స్ట్రైక్ ఇంటు ద క్రౌడ్.. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఈయర్స్. ద పార్టీ బిగిన్స్ ఇన్ డ్రెస్సింగ్ రూమ్'అంటూ రవిశాస్త్రి చెప్పిన వ్యాఖ్యానం ఇప్పటికీ చెవల్లో గిల్లుమంటోంది.

ధోనీ ఆ షాట్ ఆడిన క్షణం.. 130 కోట్ల యావత్ భారత్ భావోద్వేగంతో ఉప్పొంగింది. ఆ మ్యాచ్లో ధోనీ ఆడిన (91 నాటౌట్) ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. అతన్ని వరల్డ్ బెస్ట్ కెప్టెన్గా నిలబెట్టింది. అయితే ఆ మ్యాచ్లో ఉపయోగించిన ధోనీ బ్యాట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్గా నిలిచింది.
లండన్లోని ఓ చారిటీ ఈవెంట్లో ధోనీ బ్యాట్ను వేలం వేస్తే అక్షరాల రూ.83 లక్షలు పలికింది. ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్(ఇండియా) కంపెనీ ఈ అత్యంత భారీ ధర చెల్లించి ధోనీ బ్యాట్ను సొంతం చేసుకుంది. అయితే.. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ధోనీ సతీమణి సాక్షి ఆధ్వర్యంలో నడిచే సాక్షి ఫౌండేషన్ ఖర్చు చేయనుంది.
రూ. 83 లక్షలు పలికిన ఈ బ్యాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్గా నిలిచిపోయింది. 38 ఏళ్ల భారత నిరీక్షణను తెరదించిన ఆ బ్యాట్కు ఆ మాత్రం ధర పెట్టాల్సిందే. సాక్షి ఫౌండేషన్ భారత్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అనాథ పిల్లలకు అండగా నిలుస్తోంది.
ఇక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఆ జట్టుకు మరో టైటిల్ అందించాడు. అప్కమింగ్ సీజన్ ఆడుతానని కూడా ధోనీ వెల్లడించాడు.