
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ ఓ బంతిని నోబాల్గా ప్రకటించడంపై దుమారం రేగింది. అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా వాగ్వాదం దిగడం చర్చనీయాంశమైంది. ఫీల్డర్ తప్పిదం కారణంగానే తాను నోబాల్ ప్రకటించానని ఫీల్డ్ అంపైర్ సమాధానం ఇవ్వడంతో తప్పు తెలుసుకున్న ధోనీ మౌనంగా ఉండిపోయాడు. కానీ ఈ విషయాన్ని గ్రహించలేకపోయిన అభిమానులు.. అంపైర్ది తప్పుడు నిర్ణయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఏం జరిగిందంటే? ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా డ్వేన్ బ్రావో వేసిన 14వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని గుడ్ లెంగ్త్ రూపంలో బ్రావో సంధించాడు. దినేశ్ కార్తీక్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా బంతిని హిట్ చేసి సింగిల్ తీశాడు. అయితే ఆ బంతిని అంపైర్ నోబాల్గా ప్రకటించాడు. అంపైర్ నోబాల్గా ప్రకటించడంతో డ్వేన్ బ్రావో బహుశా.. క్రీజు వెలుపల పాదం ఉంచి బంతి విసిరాడని అంతా ఊహించారు. కానీ.. నాన్స్ట్రైక్ ఎండ్ వైపు ఉన్న అంపైర్.. స్వ్కేర్ లెగ్ అంపైర్ వైపు మూడు వేళ్లు చూపిస్తూ.. నోబాల్ అని చెప్పడంతో.. ధోనీ రంగంలోకి దిగాడు.
ఆ వెంటనే జడేజా.. సమీపంలోని ఫీల్డర్ అంబటి రాయుడు కూడా అంపైర్ల వద్దకి వచ్చారు. దాంతో.. అంపైర్ నింపాదిగా.. స్వ్కేర్ లెగ్ (లెగ్ సైడ్)లో ముగ్గురు ఫీల్డర్లు ఉన్నారు అని సమాధానమిచ్చాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం.. స్వ్కేర్ లెగ్లో ఇద్దరు ఫీల్డర్లని మాత్రమే అనుమతిస్తారు. అంపైర్ సమాధానంతో ధోనీ, జడేజా మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయారు. కానీ.. ఫ్రీ హిట్ బంతికి షబాజ్ ఒక పరుగు మాత్రమే రాబట్టగలిగాడు. ఆ టైమ్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో షెహబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తుండటంతో ఫీల్డ్ సెటప్లో సీఎస్కే పొరపాటు చేసింది. ఈ మ్యాచ్లో చెన్నై 23 పరుగులతో గెలుపొందింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబె ( 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 95 నాటౌట్), రాబిన్ ఉతప్ప ( 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 88) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. అనంతరం బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది.
షాబాజ్ అహ్మద్( 27 బంతుల్లో 4 ఫోర్లతో 41), సూయాశ్ ప్రభుదేశాయ్ ( 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 34), దినేశ్ కార్తీక్ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34) రాణించారు. ఛేదనలో చకచకా నాలుగు వికెట్లు పడ్డా బెంగళూరు పోరాడింది. తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బతీశారు.