టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోమవారం(ఆగస్ట్ 18)తో అంతర్జాతీయ క్రికెట్లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్లోకి తారా జువ్వలా దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ.. అందరి ఆటగాళ్లలానే కెరీర్ ఆరంభంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. తన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న కోహ్లీ.. పరుగుల వరద పారించి చూస్తుండగానే వరల్డ్ బెస్ట్ బ్యాటర్గా ఎదిగాడు.
2008లో శ్రీలంకతో వన్డే సిరీస్కు అప్పటి సీనియర్ బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ గాయాలతో దూరమవడంతో అనూహ్యంగా టీమిండియా పిలుపును అందుకున్న కోహ్లీ.. గంభీర్తో కలిసి ఓపెనర్గా కెరీర్ ప్రారంభించాడు. కానీ తొలి మ్యాచ్లో 12 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ సిరీస్లో ఓ హాఫ్ సెంచరీతో రాణించినా.. తరవాతి సిరీస్కు సచిన్, సెహ్వాగ్ అందుబాటులోకి రావడంతో కోహ్లీ జట్టులో చోటు కోల్పోయాడు.

2009లో భారత్లో శ్రీలంక పర్యటించినప్పుడు నాలుగో వన్డేకు గాయంతో యువరాజ్ సింగ్ దూరమయ్యాడు. అతని స్థానంలో కోహ్లీకి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్తో కలిసి సింగిల్స్ తీస్తూ కోహ్లీ తన తొలి శతకాన్ని సాధించాడు. ఆ తర్వాత కూడా కోహ్లీ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే అతనికి అప్పటి సారథి మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలిచాడు. దాంతోనే అతను స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. లేదంటే అప్పుడే అతని కెరీర్ క్లోజ్ అయ్యేదని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
రోహిత్ శర్మను కాదని తాను, ధోనీ.. కోహ్లీకి అండగా నిలిచామని సెహ్వాగ్ ఓ సిరీస్ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. 2016లో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన సిరీస్కు సెహ్వాగ్ కామెంటేటర్గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా కోహ్లీకి తాము మద్దతుగా నిలిచిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. '2012లో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్కు సెలెక్టర్లు కోహ్లీకి బదులు రోహిత్ శర్మను ఆడించాలనుకున్నారు. ఆ సమయంలో నేను వైస్ కెప్టెన్గా ఉండగా.. ధోనీ సారథిగా ఉన్నాడు. మేం ఇద్దరం కోహ్లీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత కోహ్లీ చరిత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు.'అని సెహ్వాగ్ తెలిపాడు.
ఆ మ్యాచ్లో కోహ్లీ రెండు ఇన్నింగ్స్ల్లో 44, 75 పరుగులు చేశాడు. బ్యాటింగ్కు కఠినంగా ఉన్న ఆ వికెట్పై అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆ ప్రదర్శనతో అతను టెస్ట్ల్లో రెగ్యులర్ బ్యాటర్గా మారాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ 123 మ్యాచ్ల్లో 9230 పరుగులు చేశాడు. 68 మ్యాచ్లకు సారథ్యం వహించి 40 మ్యాచ్లు గెలిపించాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.