
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అందరూ యూఏఈలో ప్రాక్టీస్ మొదలు పెట్టాలని భావిస్తుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం భారత్లోనే దానికి శ్రీకారం చుట్టనుంది. వచ్చే నెల 19 నుంచి జరగబోయే ఈ లీగ్ కోసం మిగతా జట్లు ఆలోచనలు ఎలా ఉన్నా ధోనీ సేన మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా నిర్ణయాలు తీసుకుంటుంది.
ఈనెల 15 నుంచి ఎంఎ చిదంబరం స్టేడియంలో సీఎస్కే ఆటగాళ్లు ఓ వారం రోజుల పాటు ప్రాక్టీస్కు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి సాధించింది. ఈ క్యాంపులో ధోనీ, రైనా, రాయుడు, హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా తదితర స్వదేశీ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరంతా ఈనెల 14నే చార్టర్డ్ ఫ్లయిట్స్లో చెన్నై చేరుకోనున్నారు.
తర్వాతి రోజు నుంచి చెపాక్ స్టేడియం నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. కరోనా కారణంగా చాలా కాలం పాటు ఆటగాళ్లకు శిక్షణ లేకుండా పోయింది. అందుకే వారం రోజుల పాటు ఇక్కడే తగిన ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని ధోనీ సూచించాడని టీమ్మేనేజ్మెంట్ పేర్కొంది. ఆగస్టు 21న ధోనీ బృందం దుబాయ్కి వెళుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ తప్ప మరే ఇతర జట్టు కూడా స్వదేశంలో క్యాంపు ఏర్పాటు చేసే ఆలోచనలో లేదు.
'చెన్నైకి వచ్చిన ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండరు. ఎందుకంటే ఇక్కడికి రావడానికి రెండ్రోజుల ముందే వారు కరోనా టెస్టులు చేయించుకుంటారు. ఇక, ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లు కేవలం హోటల్, స్టేడియానికే పరిమితమవుతారు. చెన్నైలో సాధన ప్రారంభించాక కూడా రెండుసార్లు పరీక్ష చేయించుకుంటారు. నెగటీవ్ వచ్చిన ఆటగాళ్లే దుబాయ్ వెళ్తారు' అని సీఎస్కే అధికారి తెలిపాడు.
చెన్నైలోనే క్యాంప్ను నిర్వహించాలన్న ధోనీ ఆలోచనకు మద్దతిచ్చిన ఫ్రాంచైజీ.. ప్రభుత్వ పర్మిషన్ కోసం వారం రోజులుగా శ్రమించింది. ప్లేయర్లకు ప్రాక్టీస్ క్యాంప్ ఎంత అవసరమో అధికారులకు స్పష్టంగా తెలియజేసింది. అయితే ఫారిన్ ప్లేయర్లు, స్టాఫ్ను మాత్రం చెన్నైలోకి అనుమతించేందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీ క్యాంప్ను పర్యవేక్షించనున్నాడు.