28 బంతుల్లోనే 8 వికెట్లు..
15 ఓవర్ల వరకు 121/2తో పటిష్టంగా ఉన్న వార్నర్ సేన ఒక్కసారిగా సాగిలపడిపోయింది. బెయిర్స్టో, మనీష్ పాండే(34) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. 12, 0, 7 , 6, 0, 9, 0 తో బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టడంతో 28 బంతుల్లోనే మిగతా 8 వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది. ఆశలు పెట్టుకున్న అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్(12).. ఆల్రౌండర్ విజయ్ శంకర్(0), అఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్(6)తో సహా అందరూ విఫలమయ్యారు. అయితే బెయిర్స్టో వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్రౌండర్ విజయ్ శంకర్ చహల్ గూగ్లీ బంతికి క్లీన్ బౌల్డ్ అయి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.
విజయ్ శంకరూ.. రాయుడు చూస్తున్నాడు..
ఆల్రౌండర్గా బాధ్యతాయుతంగా ఆడాల్సిన స్థితిలో విజయ్ శంకర్ గోల్డెన్ డక్గా వెనుదిరగడంపై అభిమానులు మండిపడుతున్నాడు. 3డీ ఆటగాడైన నువ్వు ఇలా ఆడితే ఎలా అని ట్రోల్ చేస్తున్నారు. అంబటి రాయుడు 3డీ గ్లాస్లో శంకర్ ఆటను చూస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక గతేడాది జరిగిన ప్రపంచకప్లో తెలుగు తేజం అంబటి రాయుడిని కాదని ఎమ్మెస్కే ప్రసాధ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విజయ్ శంకర్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ త్రీడైమన్షన్ నేపథ్యంలోనే అతని ఎంపిక చేశామని అప్పట్లో ఎమ్మెస్కే వివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై రాయుడు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిచండంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో రాయుడు రఫ్ఫాడించడంతో అభిమానులు ఎమ్మెస్కేతో పాటు కెప్టెన్ కోహ్లీని రోస్ట్ చేశారు. తాజాగా శంకర్ విఫలమవడంతో మరోసారి అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
క్షుద్ర పూజలతో ఆర్సీబీ కుతంత్రం..
ఇక గత మూడు సీజన్లలో దారుణంగా విఫలమైన ఆర్సీబీ.. ఈ సీజన్ ఆరంభం మ్యాచ్లో గెలవడంపై అభిమానులు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్కు ముందు మంత్రగాళ్లతో ఆర్సీబీ క్షుద్ర పూజలు చేసిందని అందుకే గెలిచిందని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే ఐపీఎల్ 2019 సీజన్లో కనీసం ప్లేఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోయిన బెంగళూరు టీమ్.. పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానంలో నిలిచింది. కానీ.. తాజా విజయంతో ఈ సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దీంతో ఆర్సీబీ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, చాహల్ ఫియాన్సీ ధన్యశ్రీ వర్మతో కూడిన ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక లాక్డౌన్లో టిక్టాక్ వీడియోలతో సందడి చేసిన వార్నర్ను.. ఇప్పుడు మైదానంలో చిందేమనండనే మీమ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి.
ఉమేశ్ నువ్వు మారవా..?
ఇక ఆర్సీబీ బౌలర్లలో చాహల్, శివమ్ దూబే, నవదీప్ సైనీ బెంగళూరుని గెలిపించేందుకు పొదుపుగా బౌలింగ్ చేసినా.. సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మాత్రం ధారాళంగా పరుగులిచ్చేశాడు. ఎంతలా అంటే అతనికి బంతిని అందిస్తున్నారంటే ఆర్సీబీ ఫ్యాన్స్ వెన్నులో వణుకు మొదలయ్యేంత. మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఉమేశ్ ఏకంగా 48 పరుగులిచ్చాడు. దీంతో అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. మ్యాచ్ గెలవకుంటే నీకుండేదని ఒకరంటే.. పడిక్కల్, ఏబీడీ వాయించటోళ్లని కామెంట్ చేస్తున్నారు. యువ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేస్తుంటే.. సీనియర్ బౌలర్ అయినా నువ్వు పరుగులివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications












