టీమిండియా హెడ్ కోచ్గా నియమితుడైన గౌతమ్ గంభీర్ తన పంతం నెగ్గించుకున్నాడు. సహాయక సిబ్బంది నియామకం విషయంలో తనకు అనుకూలంగా ఉండేవారినే ఎంపిక చేసుకున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ కోచ్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో గంభీర్ గట్టిగా వాదించినట్లు తెలుస్తోంది. తన మాజీ కేకేఆర్ సహచరుడు, సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ను బౌలింగ్ కోచ్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మోర్నీ మోర్కెల్ను బౌలింగ్ కోచ్గా నియమించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 'మోర్నీ మోర్కెల్ను బౌలింగ్ కోచ్ నియమించేందుకు కావాల్సిన ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి కాలేదు. కానీ, త్వరలోనే అవి పూర్తవుతాయి. శ్రీలంక సిరీస్ తర్వాత మోర్నీ మోర్కెల్ టీమిండియా బౌలింగ్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తాడు.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలను చేపట్టనున్న విషయం తెలిసిందే. జూలై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20లు, ఆగస్టు 2 నుంచి మూడు వన్డేల సిరీస్లు ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన జట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అసిస్టెంట్ కోచ్లుగా టీమిండియా మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్తో పాటు నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్ టెన్ డస్కాటే నియమించారు. బౌలింగ్ కోచ్ నియామకం పూర్తి కాలేదు. దాంతో ఎన్సీఏలో బౌలింగ్ కోచ్గా పని చేస్తున్న సాయిరాజ్ తాత్కలిక బౌలింగ్ కోచ్గా పనిచేయనున్నాడు.
బౌలింగ్ కోచ్ రేసులో ఆర్ వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీలు ఉన్నారు. మోర్నీ మోర్కెల్ను బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మోర్కెల్, గంభీర్ కేకేఆర్కు కలిసి ఆడారు. 2014 సీజన్లో టైటిల్ కూడా గెలిచారు. లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా ఉన్న సమయంలోనూ మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. మోర్నీ మోర్కెల్కు అంతర్జాతీయ బౌలింగ్ కోచ్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కొంతకాలం పాటు మోర్కెల్ పాకిస్థాన్ క్రికెట్ టీమ్కు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు.