ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ టోర్నీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్లో అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్ జట్లు తలపడనున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 10) యూఏఈతో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. ఈ టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. గిల్, శివమ్ దూబే రాకతో టీమిండియా కాంబినేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే హార్దిక్ పాండ్యా రూపంలో పేస్ ఆల్రౌండర్ ఉండనున్న నేపథ్యంలో దూబేకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ టీమిండియా కాంబినేషన్కు బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన శివమ్ దూబే కీలకమని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. యూఏఈతో మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మోర్కెల్.. టీమ్ కాంబినేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతోనే శివమ్ దూబేను జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. తుది జట్టులో శివమ్ దూబే ఉంటాడని హింట్ ఇచ్చాడు.

'నాలుగు ఓవర్ల పూర్తి కోటా వేసే బౌలర్గా శివమ్ దూబేను నేను ఎప్పుడూ ఉపయోగించుకోవాలనుకుంటాను. ఆల్రౌండర్స్ ఎప్పుడూ తమ రెండు నైపుణ్యాలపై ఫోకస్ పెట్టాలని నేను ప్రోత్సహిస్తాను. కొన్నిసార్లు ఆటగాళ్లు ప్రాక్టీస్లో అల్లరి పనులు చేస్తూ ఒకే నైపుణ్యంపై ఫోకస్ పెడుతారు. కానీ ఇక్కడ మేం ఏ అవకాశాలను వదులుకోం. మ్యాచ్ రోజు ఇతరుల కంటే సదరు ఆల్రౌండర్కు పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలి.
కెప్టెన్కు ఎంత ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటే అంత మంచిది. మాకు ఫ్రంట్లైన్ బౌలర్లు ఉన్నారు. కానీ అదనపు బౌలింగ్ ఆప్షన్స్ టీమ్ ఎంపిక, సరైన కాంబినేషన్కు కలిసొస్తాయి.'అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు. మోర్కెల్ వ్యాఖ్యల ప్రకారం ఎక్స్ట్రా పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే తుది జట్టులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అతను స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఆడగలడు. అతని ఎంపికతో జట్టుకు బ్యాటింగ్ డెప్త్తో పాటు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా లభించనుంది. శివమ్ దూబే తుది జట్టులోకి వస్తే రింకూ సింగ్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో ఆడనున్న భారత్.. సెప్టెంబర్ 14న పాకిస్థాన్, సెప్టెంబర్ 19న ఒమన్తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.