ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో టీమిండియా వెనుకంజలో నిలిచింది. వరుసగా రెండు రోజులు ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్పై పట్టు బిగించింది. బాజ్ బాల్ బ్యాటింగ్తో చెలరేగి ఇంగ్లండ్ భారీ స్కోర్ నమోదు చేసింది.ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి భారత బౌలర్లు తేలిపోయారు. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దాంతో టీమిండియా మేనేజ్మెంట్ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్ను తీసుకోకపోవడం టీమిండియా చేసిన ఘోర తప్పిదమని విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. కుల్దీప్ యాదవ్ను తీసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
బ్యాటింగ్ డెప్త్ కోసమే కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోలేదని స్పష్టం చేశాడు. మూడో రోజు మ్యాచ్ అనంతరం మాట్లాడిన మోర్నీ మోర్కెల్ భారత వైఫల్యానికి గల కారణాలను వెల్లడించాడు. 'కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవడంపై చర్చించాం. అతని రాకతో టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేదానిపై సమాలోచనలు చేశాం. ఇంగ్లండ్పై విజయం సాధించాలంటే బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండాలని భావించాం. బ్యాటింగ్ డెప్త్ ఉంటేనే ఆధిపత్యం చెలాయించవచ్చనుకున్నాం. అందుకే కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వలేకపోయాం. అతను వరల్డ్ క్లాస్ బౌలర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేసి వికెట్ తీయగల సమర్థుడు. అతన్ని తుది జట్టులోకి తీసుకునేందుకు ఉన్న మార్గాలన్నింటినీ పరిశీలించాం. భవిష్యత్తులో ఆడించే ప్రయత్నం చేస్తాం.'అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.

స్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి కీలక బౌలర్లకు గాయాల బెడద ఉన్నప్పటికీ, తమ శక్తి మేరకు బాగానే బౌలింగ్ చేశారని మోర్నీ మోర్కెల్ అన్నాడు. రెండో రోజు ఆటతో పోలిస్తే, మూడో రోజు ఆటలో మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారని.. వారు పెద్దగా పరుగులు ఇవ్వలేదని ఆయన అన్నారు. అయితే ఇలాంటి పిచ్లపై నిరంతరం బౌలింగ్ చేయడానికి చాలా శక్తి అవసరమని మోర్నె మోర్కెల్ స్పష్టం చేశారు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉండటంతోనే నాలుగో బౌలర్ అయిన శార్దూల్ ఠాకూర్కు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదన్నాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 135 ఓవర్లలో 7 వికెట్లకు 544 పరుగులు చేసింది. క్రీజులో బెన్ స్టోక్స్తో పాటు లియామ్ డాసన్(21 బ్యాటింగ్) ఉన్నాడు. జోరూట్(248 బంతుల్లో 14 ఫోర్లతో 150) భారీ శతకంతో చెలరేగగా.. ఓలీ పోప్(128 బంతుల్లో 7 ఫోర్లతో 71), బెన్ స్టోక్స్(134 బంతుల్లో 6 ఫోర్లతో 77 బ్యాటింగ్) అర్ధ సెంచరీలతో రాణించారు. క్రీజులో బెన్ స్టోక్స్తో పాటు లియామ్ డాసన్(21 బ్యాటింగ్) ఉన్నాడు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్, బమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.ఇంగ్లండ్ ఆధిక్యం ఇప్పటికే 186 పరుగులు చేరింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయవకాశాలు సన్నగిల్లాయి. డ్రా చేసుకోవడం మినహా భారత జట్టు ముందు మరో ఆప్షన్ లేదు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులే చేసిన విషయం తెలిసిందే.