మిడిల్ ఓవర్లలో బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని అమెరికా కెప్టెన్ మొనాంక్ పటేల్ అన్నాడు. అనవసర ఒత్తిడికి లోనై మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన తమ రెండో మ్యాచ్లో సమష్టిగా విఫలమైన అమెరికా 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 190 పరుగులు చేయగా.. అమెరికా 158 పరుగులే చేసి ఓటమిపాలైంది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షాహిబ్జాదా ఫర్హాన్(41 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 73), ఉస్మాన్ తారిఖ్(3/27), షాదాబ్ ఖాన్(2/26) అమెరికా పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై మాట్లాడిన మొనాంక్ పటేల్.. మిడిల్ ఓవర్లలో కాస్త మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

'మేం పవర్ప్లేలో బాగానే బౌలింగ్ చేశాం. కానీ మిడిల్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయలేకపోయాం. చివరి నాలుగు ఓవర్లలో పేసర్లు బాగా బౌలింగ్ చేయడంతో తిరిగి మ్యాచ్లోకి వచ్చాం. పాకిస్థాన్ 190 పరుగులు చేసినా మేము రేసులోనే ఉన్నాం. పవర్ప్లేలో బాగానే బ్యాటింగ్ చేశాం. కానీ మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడలేకపోయాం.
బ్యాటింగ్ చేసేటప్పుడు మాలో ఆ పట్టుదల కనిపించలేదు. పాక్ స్పిన్నర్లు వేగం తగ్గించి బౌలింగ్ చేయడంతో బౌండరీలు కొట్టడం కష్టమైంది. దాంతో మేం అనవసర ఒత్తిడికి లోనయ్యాం. అదే మా ఓటమిని శాసించింది. గత 12-15 నెలలుగా మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఈ మ్యాచ్కు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో వచ్చాం. మ్యాచ్లో కొన్ని పొరపాట్లు జరిగాయి.
ఈ వరల్డ్ కప్లో మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచి టోర్నీని బలంగా ముగించాలనుకుంటున్నాం. వేర్వేరు వేదికలపై ఆడటం అంత సులువు కాదు. ఇప్పుడు మేం చెన్నై వెళ్తాం. అక్కడ మాకు ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. మరింత బలంగా తిరిగి రావడానికి కృషి చేస్తాం.'అని మోనాంక్ పటేల్ చెప్పుకొచ్చాడు. అమెరికా తమ తదుపరి మ్యాచ్లను నెదర్లాండ్స్, నమీబియాతో ఆడనుంది. ఈ ఓటమితో సూపర్-8 అవకాశాలను అమెరికా చేజార్చుకుంది.