ఆసియా కప్ 2025 ట్రోఫీతో పాటు మెడల్స్ ఎత్తుకెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ మోహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బెదిరింపులతో వెనక్కి తగ్గాడు. ఆసియా కప్ ట్రోఫీతో పాటు మెడల్స్ను భారత్కు ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. ఏసీసీ వర్గాలు ఈ వార్తలను దృవీకరించాయి. ఆసియాకప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ మంత్రిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఛైర్మెన్ హోదాలో టైటిల్ అందించడం తన హక్కు అని, తన చేతుల మీదుగానే టీమిండియా ట్రోఫీ అందుకోవాలని నఖ్వీ పట్టుబట్టాడు. దాంతో ట్రోఫీ ప్రదానం చేయకుండా ఆసియా కప్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ముగిసింది. తన చేతుల మీదుగా ట్రోఫీని భారత్ తీసుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన నఖ్వీ.. విన్నింగ్ మెడల్స్తో పాటు ట్రోఫీని తన వెంటే తీసుకెళ్లాడు. ట్రోఫీ లేకున్నా.. ఊహజనిత టైటిల్తో టీమిండియా సంబరాలు చేసుకుంది. తమ సహచర ఆటగాళ్లు, కోచ్లు, అభిమానులు పెట్టుకున్న నమ్మకమే తమకు అతిపెద్ద టైటిల్ అని సూర్య చెప్పుకొచ్చాడు. టైటిల్ ఎత్తుకెళ్లిన నఖ్వీ తీరును తప్పుబట్టాడు.

ఈ వ్యవహారంపై బీసీసీఐ కూడా ఘాటుగా స్పందించింది. వర్చువల్గా సాగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా నఖ్వీ తీరును తప్పుబట్టాడు. విజేతగా నిలిచిన జట్టుకు టైటిల్ అందించాలని, అది ఏ ఒక్కరి ఆస్థి కాదని మండిపడ్డాడు. అయితే ఈ మీటింగ్ ఎజెండా కాదని నఖ్వీ బుకాయించే ప్రయత్నం చేశాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమైంది. ట్రోఫీని ఎత్తుకెళ్లి నఖ్వీ ఏసీసీ నియమాలను ఉల్లంఘించాడని, అతన్ని ఏసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఐసీసీ మీద బీసీసీఐ ఒత్తిడి తెచ్చింది. దాంతో జరగబోయే పరిమాణాలకు బెదిరి.. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ బోర్డుకు అందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని భారత జట్టుకు ఎలా అందిస్తారనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.
మరోవైపు పీసీబీ ఛైర్మన్ బాధ్యతల నుంచి మోహ్సిన్ నఖ్వీ తప్పుకోవాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిన్ అఫ్రిది డిమాండ్ చేశాడు. పాకిస్థాన్ మంత్రిగా.. పీసీబీ ఛైర్మన్గా నఖ్వీ న్యాయం చేయలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ క్రికెట్పై ప్రత్యేక శ్రద్ద చూపే ఛైర్మన్ కావాలని అఫ్రిది నొక్కి చెప్పాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టు భారత్ చేతిలో ఘోర పరాజయాలను ఎదుర్కొంది. భారత్తో ఆడిన మూడు మ్యాచ్లకు మూడింటిని పాకిస్థాన్ ఓడిపోయింది. ఫైనల్లో పోటీ ఇచ్చినా తొలి రెండు మ్యాచ్ల్లో చిత్తయ్యింది.