ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్లో టీమిండియా ఓటమి ముంగిట నిలిచింది. హోరాహోరీగా సాగిన నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ పై చేయి సాధించింది. చివర్లో పుంజుకున్నా.. భారత ఆశలపై బ్యాడ్ లైట్ నీళ్లు చల్లింది. వెలుతురు లేమి, వర్షం కారణంగా నాలుగో రోజు ఆటను అంపైర్లు నిర్ణీత సమం కన్నా ముందే ముగించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది.
హ్యారీ బ్రూక్(98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 111), జోరూట్(152 బంతుల్లో 12 ఫోర్లతో 105) శతకాలతో సత్తా చాటగా... బెన్ డకెట్( 83 బంతుల్లో 6 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రీజులో జెమీ ఓవర్టన్(0 బ్యాటింగ్), జెమీ స్మిత్(2 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్కు ఓ వికెట్ దక్కింది.
ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. భారత్కు నాలుగు వికెట్లు కావాలి. గాయంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయని క్రిస్ వోక్స్.. అవసరమైతే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. గాయమైన భుజంతోనే బ్యాటింగ్ వచ్చేందుకు జెర్సీ వేసుకొని రెడీగా కనిపించాడు. దాంతో టీమిండియా విజయానికి నాలుగు వికెట్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ మ్యాచ్ హీరో మహమ్మద్ సిరాజ్ ఫీల్డింగ్లో చేసిన తప్పిదం టీమిండియాను కష్టాల్లోకి నెట్టింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్న సిరాజ్.. సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కాడు. ఈ అవకాశంతో చెలరేగిన బ్రూక్.. టీమిండియాను శతక్కొట్టాడు. ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగడం కూడా టీమిండియాకు నష్టం చేసింది. స్పిన్నర్లు ప్రభావం చూపకపోవడంతో పేసర్లు.. అదనపు భారాన్ని మోయలేకపోయారు. ఆకాష్ దీప్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకొని బౌలింగ్ చేశాడు.
374 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 50/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్ డకెట్(54)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. కెప్టెన్ ఓలీ పోప్(27)ను సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. పోప్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్, జో రూట్ ఇంగ్లండ్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. జో రూట్ నిదానంగానే ఆడినా.. హ్యారీ బ్రూక్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.
ఈ క్రమంలో ప్రసిధ్ కృష్ణ వేసిన 35వ ఓవర్లో సిరాజ్ చేసిన తప్పిదం కారణంగా హ్యారీ బ్రూక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అప్పటికి హ్యారీ బ్రూక్ చేసింది 19 పరుగులు మాత్రమే. ప్రసిధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ఈ బంతిని అద్భుతంగా అందుకున్నప్పటికీ బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ తొక్కాడు. దాంతో క్యాచ్ కాస్త సిక్సర్గా మారింది. ఈ అవకాశంతో హ్యారీ బ్రూక్ చెలరేగాడు. సిరాజ్ చేసిన తప్పిదం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఇంగ్లండ్ 164/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లో మరింత సాధికారికంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా మారడంతో బ్రూక్ భారీ షాట్లతో చెలరేగాడు. 39 బంతుల్లో బ్రూక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. జోరూట్ 81 బంతుల్లో అర్థ శతకం అందుకున్నాడు. ఆ తర్వాత ఈ జోడీకి అడ్డే లేకుండా పోయింది. ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు శుభ్మన్ గిల్ చేయని ప్రయత్నం లేదు. బౌలర్లను మార్చినా.. స్పిన్నర్లను బరిలోకి దించినా ఫలితం లేకపోయింది.
మరోవైపు బ్రూక్ 91 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ అనంతరం మరింత వేగంగా ఆడాడు. అతన్ని ఎట్టకేలకు ఆకాష్ దీప్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 195 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి జాకోబ్ బెతెల్ రాగా.. ఇంగ్లండ్ 317/4 టీ బ్రేక్కు వెళ్లింది.
ఆఖరి సెషన్ ఆరంభంలోనే జో రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాష్ దీప్ వేసిన 69వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. జోరూట్కు కెరీర్లో ఇది 39వ సెంచరీ. అయితే ప్రసిధ్ కృష్ణ వరుస ఓవర్లలో జాకోబ్ బెతెల్(5), జో రూట్(105)లను తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. జాకోబ్ బెతెల్ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రసిద్.. జోరూట్ను కీపర్ క్యాచ్గా ఔట్ చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.