వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ను టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బెదిరించాడు. పరుగులు చేస్తే బాగుండదని హైదరాబాద్ స్టైల్లో దమ్కీ ఇచ్చాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా జస్టిన్ గ్రీవ్స్ మారాడు. జైడెన్ సీల్స్తో కలిసి ఆఖరి వికెట్కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. వెస్టిండీస్ను ఆలౌట్ చేసేందుకు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించ లేదు
బౌలర్లు, ఫీల్డ్ సెట్ మార్చినా.. లాభం లేకపోయింది. ఈ క్రమంలోనే ఆఖరి సెషన్ ప్రారంభానికి ముందు జస్టిన్ గ్రీవ్స్ దగ్గరకు వెళ్లిన సిరాజ్.. బెదిరింపులకు పాల్పడ్డాడు. త్వరగా ఔటవ్వకపోతే బాగుండదని దమ్కీ ఇచ్చాడు. అతని బెదిరింపులకు జస్టిన్ గ్రీవ్స్ పడి పడి నవ్వాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. డీఎస్పీ సాబ్ రౌడీలా బెదిరిస్తున్నాడేంటి..? అని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఫీల్డింగ్, బౌలింగ్ చేయడం తమ వల్ల కావడం లేదని, ఔటవ్వరా అయ్యా అని సిరాజ్ వేడుకుంటున్నాడని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియాకు 270 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. వెంటనే వెస్టిండీస్ను ఫాలో ఆన్ ఆడించి ఇన్నింగ్స్ తేడాతో గెలవాలనుకున్న టీమిండియా వ్యూహం బెడిసి కొట్టింది. సంచలన బ్యాటింగ్తో వెస్టిండీస్.. టీమిండియాపైకి తిరగబడింది.
తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు తీవ్రంగా అలసి పోవడం.. పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా మారడటం విండీస్కు కలిసొచ్చింది. జాన్ కాంప్బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 103) సెంచరీలతో రాణించారు. మూడో వికెట్కు 177 పరుగులు జోడించారు. కాంప్బెల్కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కాగా.. 8 ఏళ్ల తర్వాత షైహోప్ మరో శతకాన్ని అందుకున్నాడు.
జాన్ కాంప్బెల్ను జడేజా ఔట్ చేస్తే.. షైహోప్ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, బుమ్రా నిప్పులు చెరిగడంతో విండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. కానీ జస్టిన్ గ్రీవ్స్ అడ్డుగా నిలబడ్డాడు. బుమ్రా బౌలింగ్లో బౌండరీ బాది 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో జైడెన్ సీల్స్ను ఔట్ చేసి విండీస్ రెండో ఇన్నింగ్స్కు బుమ్రా తెరదించాడు. దాంతో భారత్ ముందు 121 పరుగుల లక్ష్యం నమోదైంది.