టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ హైదరాబాద్ పేసర్ పేలవ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాడు.
టెస్ట్, వన్డే ఫార్మాట్స్లో టీమిండియా రెగ్యులర్ బౌలర్గా కొనసాగుతున్న సిరాజ్.. టీ20ల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడాడు. ఆర్సీబీ తరఫున పేలవ ప్రదర్శనతో ఆ జట్టుకు భారంగా మారాడు. చివరకు తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు.

9 మ్యాచ్ల్లో 9.6 ఎకానమీ, 57 సగటుతో 2 వికెట్లు మాత్రమే తీసి చెత్త గణంకాలు నమోదు చేశాడు. ముఖ్యంగా అతని ఎకానమీ క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే మహమ్మద్ సిరాజ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయవద్దనే వాదన వినిపిస్తోంది. టీ20ల్లో అతని రికార్డ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. 6 ఓవర్లకు ఓ వికెట్ తీస్తున్న సిరాజ్.. ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.
మహమ్మద్ సిరాజ్ కంటే ఆవేశ్ ఖాన్ రికార్డ్స్ బాగున్నాయని, అతన్ని తీసుకోవడం ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇర్ఫాన్ పఠాన్, కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా సిరాజ్కు బదులు ఆవేశ్ ఖాన్ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే టీ20 ప్రపంచకప్ 2024 జరిగే వెస్టిండీస్, అమెరికా పిచ్లు.. సిరాజ్ బౌలింగ్కు సరిగ్గా సెట్ అవుతాయి.
ఈ ఒక్క విషయం తప్పా అతనికి సానుకూలమైన అంశాలు ఏవి లేవు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ప్రధాన పేసర్లుగా ఎంపికవ్వనుండగా.. మూడో పేసర్గా సిరాజ్కు అవకాశం దక్కాలంటే అతను మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ల్లో సత్తా చాటాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఫామ్లోకి వచ్చినట్లు కనబడ్డాడు. అయితే చిన్న మైదానం అయిన చిన్నస్వామిలో బౌలర్గా సిరాజ్ సవాళ్లను ఎదుర్కొంటున్నాడు.