టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇచ్చిన దావత్ బాగుందని వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా.. హైదరాబాద్కు వచ్చిన బెంగాల్ ఆటగాళ్లకు సిరాజ్ తన రెస్టారెంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాడు. పుదుచ్చేరితో మ్యాచ్ కోసం బెంగాల్ టీమ్ హైదరాబాద్కు వచ్చింది.
బెంగాల్ టీమ్లో భాగంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్తో పాటు ఇతర ఆటగాళ్లకు సిరాజ్ తన రెస్టారెంట్లో మంచి దావత్ ఇచ్చాడు. ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మహమ్మద్ షమీ.. సిరాజ్ ఆతిథ్యం బాగుందని పేర్కొన్నాడు.
'మహమ్మద్ సిరాజ్.. నాతో పాటు బెంగాల్ టీమ్ ఆటగాళ్లను తన రెస్టారెంట్కు ఆహ్వానించాడు. ఇది మా స్నేహాన్ని బలోపేతం చేసుకోవడానికి అద్భుతమైన మార్గం. మేమంతా కలిసి చక్కటి భోజనాన్ని ఆస్వాదించాం. సరదాగా గడిపాం. మైదానంలో, బయట మంచి స్నేహబంధాన్ని ఏర్పర్చుకుంటాం. అద్భుతమైన ఆతిథ్యానికి ధన్యావాదాలు.'అని షమీ పేర్కొన్నాడు.

హైదరాబాద్, బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 3లో సిరాజ్.. 'జొహార్ఫా'అనే రెస్టారెంట్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొఘలాయ్, పర్షియన్, అరేబియన్, చైనీస్ వంటకాలు ఈ రెస్టారెంట్ ప్రత్యేకం. గాయంతో టీమిండియాకు దూరమైన మహమ్మద్ షమీ.. పూర్తి ఫిట్నెస్ సాధించి దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ 19.44 సగటుతో 9 వికెట్లు తీసాడు. మరోవైపు సిరాజ్ ఈ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. యూపీతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగి ఒక వికెట్ తీసాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.