ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్కు అవకాశం దక్కలేదు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో టీమిండియా మేనేజ్మెంట్ అతనిపై వేటు వేసింది. గత మూడు, నాలుగేళ్లుగా టీమిండియాలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగిన సిరాజ్ను ఆకస్మాత్తుగా భారత జట్టు నుంచి తప్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైనా.. వన్డే క్రికెట్లో సిరాజ్ గణంకాలు మెరుగ్గానే ఉన్నాయి. 2022 నుంచి సిరాజ్ ఇప్పటి వరకు వన్డేల్లో 72 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా కూడా సిరాజ్ నిలిచాడు. అంతేకాకుండా 2023లో సిరాజ్ వన్డే ఫార్మాట్లో 47 వికెట్లు తీసాడు. వన్డే ప్రపంచకప్ 2023లోనూ 11 మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 32 వికెట్ల తర్వాత సిరాజ్ 20 వికెట్లు తీశాడు. కానీ బుమ్రాకు అండగా మరో ఎండ్లో బౌలింగ్ చేయకపోవడంతో అతని ప్రదర్శన పేలవంగా కనిపించింది.

ఈ క్రమంలోనే అతన్ని భారత జట్టులో నుంచి తప్పించి యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ను తీసుకున్నారు. అయితే సిరాజ్ను తప్పించడానికి కెప్టెన్ రోహిత్ శర్మ మరో కారణం చెప్పాడు. కొత్త బంతితో సిరాజ్ ప్రభావం చూపినట్లు మిడిల్, డెత్ ఓవర్లలో రాణించలేదని, అందుకే అర్ష్దీప్ సింగ్ను తీసుకున్నట్లు వివరించాడు. అంతేకాకుండా బుమ్రా ఫిట్నెస్పై సందేహాలు ఉండటంతోనే అతనికి బ్యాకప్గా అర్ష్దీప్ను తీసుకోవాల్సి వచ్చిందన్నాడు.
అయితే భారత జట్టులో చోటు కోల్పోవడంపై సిరాజ్ తీవ్ర బాధలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతను రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. జనవరి 23 నుంచి హిమాచల్ ప్రదేశ్తో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని హెచ్సీఏకు తెలియజేశాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం సిరాజ్కు తగిన విశ్రాంతి కావాలసి బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. అయినా విశ్రాంతి సమయాన్ని పక్కనపెట్టి బంతితో సత్తా చాటాలని సిరాజ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.