
లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా గురువారం యూకేలో అడుగుపెట్టింది. భారత్ నుంచి ప్రత్యేక విమానంలో పురుషుల, మహిళల జట్లు అక్కడికి చేరుకున్నాయి. అయితే క్రికెటర్లంతా విమానాల్లో సందడి చేసిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్లో అభిమానులతో పంచుకుంది. ఈ విమాన ప్రయాణంలో భాగంగా ఆటగాళ్లు సరదాగా గడుపుతున్న ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. ప్రయాణ సమయంలో ఎలా గడిపారనే విషయాలను కొందరు క్రికెటర్లు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచిగా నిద్రపోతున్న తనను స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ డిస్టర్బ్ చేశాడని తెలిపాడు. ఆ తర్వాత మళ్లీ నిద్రరాలేదన్నాడు. 'ఇప్పుడే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. హోటల్కు వెళ్లడానికి మరో రెండు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఓ రెండు గంటలు మంచిగా నిద్రపోయాను. ఆ తర్వాత రోహిత్ భాయ్ వచ్చి లేపాడు. మళ్లీ నిద్ర రాలేదు. ఇక విమానం ల్యాండ్ అయ్యే రెండు గంటల ముందు మళ్లీ నిద్రపట్టింది. నిన్న రన్నింగ్ సెషన్లో పాల్గొనడంతో నేను చాలా అలసిపోయాను.'అని సిరాజ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఇక అక్షర్ మాట్లాడుతూ.. 'నేను మస్త్ నిద్రపోయిన. తరువాత మేం మూడు రోజులు కఠిన క్వారంటైన్లో ఉండబోతున్నామని చెప్పారు. ఈ మూడు రోజులు ఆటగాళ్లు కనీసం ఒకరికొకరు కలుసుకోవడానికి కూడా లేదంట. 'అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అక్కడ మూడు రోజులు హార్డ్ క్వారంటైన్లో ఉండనున్న టీమిండియా.. మరో ఏడు రోజులు సాఫ్ట్ క్వారంటైన్లో ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక జూన్ 18 నుంచి 23 వరకు న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్న కోహ్లీసేన.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది.